అమరావతి: సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ పార్టీగా నాయకత్వం చెప్పుకుంటున్న జనసేన నుండి ముఖ్య నాయకులు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుందని చాలా మంది రాజకీయ నిపుణులు భావించారు. పలువురు మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అయితే ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ అభిమానులు ఊహించిన దానికి భిన్నంగా వచ్చాయి. ఒకే ఒక అభ్యర్ధి మాత్రమే గెలిచారు. స్వయంగా పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ కూడా పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీ అధికారంలోకి రావడం కోసమే స్థాపించింది కాదనీ, సమాజంలో మార్పు, చైతన్యం తీసుకురావాలన్న లక్ష్యంతో సుదీర్ఘకాలం రాజకీయం చేయడం కోసం ఏర్పడిందని పవన్ చెప్పుకొచ్చారు.
ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ మంత్రి రావెల కిషోర్బాబు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంకి సూర్యారావు పార్టీకి గుడ్బై చెప్పి వైసిపిలో చేరారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చింతల పార్థసారధి ఆ పార్టీకి బైబై చెప్పి కాషాయం కండువా కప్పుకున్నారు. పార్టీని వీడుతున్న సమయంలో చింతల సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో ఇప్పటికీ పార్టీ నిర్మాణం జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి కారణం పార్టీ అధినేత పవన్ కళ్యాణేనని ఆరోపించారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేపడితే తన అభిమానులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే పవన్ ఆ పని చేయడం లేదని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పిన పవన్ తన అన్న నాగబాబుకు పార్లమెంట్ సీటు ఇచ్చి మాట తప్పారని చింతల అన్నారు.
ఇక తాజాగా శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీకి గుడ్బై చెప్పారు. 2014లో బిజెపి తరపున టిడిపి మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల ఎన్నికలకు కొద్ది నెలల ముందు బిజెపికి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి మరీ జనసేన పార్టీలో చేరారు. ఆకుల వైసిపిలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక్కరొక్కరుగా పార్టీని వీడి ఇతర పార్టీల వైపుకు వెళుతుండటం ఆ పార్టీ అభిమానులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ, మండల స్థాయిలో పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి సారించాలని కోరుకుంటున్నారు.