అమరావతి: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో సీనియర్ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ప్రారంభించింది. తాజాగా మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డి బిజెపి నుండి తమకు ఆహ్వానం అందిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే ఇంత వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని జెసి చెప్పారు. ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటామని జెసి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెళ్లడించారు. ఈ సందర్భంలోనే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
చంద్రబాబును తాను పొగిడిన రోజులు, విమర్శించిన రోజులు ఉన్నాయని జెసి అన్నారు. గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు ప్రయత్నించారనీ అందుకే ఆయన్ను ప్రశంసించానని జెసి పేర్కొన్నారు. జగన్ కూడా చంద్రబాబు బాటలోనే నడవాలని కోరుకుంటున్నానని జెసి అన్నారు. ‘జగన్ నాకు చిన్న తనం నుండి తెలుసు, అతనిది ఉద్రేకంతో కూడిన స్వభావం, ఒకరు చెబితే వినిపించుకోడు’ అని భావించానని జెసి అన్నారు. అభిప్రాయాలు అన్నాక మారుతాయనీ, బ్రతికున్నంత కాలం ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని జెసి అన్నారు. ఢిల్లీ పర్యటనలో జగన్ హుందాగా వ్యవహరించారని జెసి ప్రశంసించారు. పులివెందుల నుండి వచ్చిన వ్యక్తి ఇలా ఉంటాడని తాను అనుకోలేదని జెసి అన్నారు. ప్రభుత్వం పని తీరు తెలియడానికి ఆరు నెలలు పడుతుందని జెసి పేర్కొన్నారు.
బిజెపి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మాజీ మంత్రి రావెల కిషోర్బాబును ఇటీవలే బిజెపిలో చేర్చుకున్న విషయం తెలిసిందే.