అనంతపురం: టిడిపి నేత, మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డిని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్బందించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై జెసిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో ఆయనపై ఐపిసి 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కోర్టు ఉత్తర్వుల మేరకు జామీనులు సమర్పించి బెయిల్పై విడుదల అయ్యేందుకు శనివారం ఉదయం న్యాయవాదులతో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు.
పోలీసులు జెసికి బెయిల్ ఇవ్వకుండా జామీను పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలంటూ అయిదు గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మీడియాను పోలీస్ స్టేషన్లోకి అనుమతించకుండా బయటకు పంపించి వేశారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకుని జెసి అనుచరులు పలువురు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏలా ఉంది, భోజనం చేశారా, మందులు వేసుకున్నారా తెలియజేయాలని పోలీసులను కోరారు. ఆయన్ను చూడాలంటూ పట్టుబట్టారు. పోలీసులు వారిని అనుమతించకపోవడంతో స్టేషన్ ముందు భైటాయించి ఆందోళన చేశారు. జెసిని పరామర్శించేందుకు టిడిపి నేత బీకె పార్థసారథి పోలీస్ స్టేషన్కు రాగా పోలీసులు ఆయనను లోపలకి వచ్చేందుకు అనుమతించలేదు. పిఎస్ ప్రధాన ద్వారం వద్దే పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తాడిపత్రి నుండి పోలీస్ స్టేషన్కు బయలుదేరిన పలువురు జెసి అనుచరులను మార్గమద్యలోనే పోలీసులు అడ్డుకున్నారు.