అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో నేడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందు వరకూ వైఎస్ జగన్కు మద్దతుగా మాట్లాడి టిడిపి ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ విమర్శలు చేసిన ఉండవల్లి ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ పరిశీలకులను ఆలోచనలో పడవేసింది.
వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత నాలుగు నెలల వరకూ ఎటువంటి వ్యాఖ్యలు చేయని ఉండవల్లి అకస్మాత్తుగా విలేఖరుల సమావేశంలో గత రాజకీయ పరిస్థితులను ఉటంకిస్తూ జగన్మోహనరెడ్డికి హితబోధ చేశారు. ఉండవల్లి సూచనలను సిఎం ఎంత వరకూ పరిగణనలోకి తీసుకుంటారో తెలియదు కానీ ప్రస్తుతం వైసిపి ప్రజాప్రతినిధుల మనసులోని బాధ ఉండవల్లి బయటపెట్టినట్లుగా కనబడుతున్నది.
సాధారణంగా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారులతో మంచీచెడూ, సాధ్యాసాధ్యాలు క్షుణ్ణంగా చర్చించి ముందుకు సాగడం కద్దు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అందుకు భిన్నంగా చర్చకు తావివ్వడం లేదనీ, తాను ఏమి చేయాలనుకుంటున్నాదీ చెప్పి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారనీ అంటున్నారు. ఈ నిర్ణయాల వల్ల పలు వర్గాలకు కలిగే ప్రయోజనం మాట ఎలా ఉన్నా కొన్ని విషయాల్లో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నదన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దగ్గర ఆయన తీసుకున్న నిర్ణయాలపై అభిప్రాయాలు వెల్లడించే ధైర్యం ఎవరికీ లేదు. సీనియర్ అధికారులు మొదలు కొని సీనియర్ మంత్రుల వరకూ జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఓకె చెప్పటం మినహా గత్యంతరం లేదని అంటున్నారు.
వ్యక్తిగతంగా సిఫార్సులు చేస్తే మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు కూడా వినవద్దని జగన్ కలెక్టర్, ఎస్పిలకు కరాఖండిగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదు. ప్రజా ప్రతినిధుల మాటలను అధికారులు లెక్కచేయకపోతే తమ క్యాడర్ను ఎలా కాపాడుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులను గమనించే ఉండవల్లి ఇటువంటి సంచలన వ్యాఖ్యలను చేసిఉంటారని అనుకోవాల్సి వస్తున్నది. ముఖ్యమంత్రితో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం సజావుగా మనుగడ సాగించగలుగుతుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఇది చూస్తుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తి వ్యక్తం చేయలేకపోతున్నారన్న విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పారని అనుకోవాలి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఆయన సూచన చేయడం గమనార్హం.
ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఉండవల్లి చేసిన వ్యాఖ్యలలో కొన్ని కటువైన పదాలను తొలగించినా ఆ అర్థం మారకుండా ఆయన చెప్పిన మాటలను జగన్ సారధ్యంలోని సాక్షి పత్రికలో ప్రచురించారు. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలను ఖండిస్తూ తామంతా సంతోషంగా ఉన్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రకటించేందుకు ముందుకు రాకపోవడం కూడా గమనార్హం.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్న నేపధ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కొందరి నుంచి వినవస్తున్నది.
ఈ పరిస్థితుల్లో ఉండవల్లి హితబోధలను జగన్ సానుకూలంగా తీసుకుంటుంటారా లేదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.