ఢిల్లీ: సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి జెపి నడ్డా సమక్షంలో గురువారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీకి రాపోలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
పార్టీలో ఎంత నిబద్దతతో పనిచేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవరిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎదగదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న నన్ను కావాలనే పక్కన పెడుతున్నారని రాపోలు పేర్కొన్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లేఖను రాహుల్ గాంధీకి పంపారు.
రాపోలు 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. 1994 లో కాంగ్రెస్ పార్టీ చేరడానికి ముందు రాపోలు జర్నలిస్ట్ గా పనిచేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం (గాంధీ భవన్) లో మేనేజర్ గా పనిచేసారు. ఏపిసిసి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఎవరూ ఊహించని విధంగా ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2012 లో రాపోలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. 2018 వరకూ రాపోలు రాజ్యసభ సభ్యునిగా భాద్యతలు నిర్వర్తించారు.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ సీటును ఆశించారు. సీటు కోసం పార్టీ అధిష్టానాన్ని కూడా వేడుకున్నారు. కాంగ్రెస్ మాత్రం ఆయన వినతిని పట్టించుకోలేదు. అప్పటినుంచి పార్టీ వ్యవహారాలను దూరంగా ఉంటూ వస్తున్న రాపోలు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
రాపోలు టిఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరడంలేదని వెల్లడించిన ఆయన నేడు బిజెపిలో చేరారు.
ఒక వైపు పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరుతుండడం, సీనియర్లు బిజెపి బాట పటుతుండడం కాంగ్రెస్కు మింగుడు పడని విషయం. ఇటీవల కాంగ్రెస్ నుంచి డికె అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి సీనియర్లు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.