(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బిజెపి ఘన విజయం సాధిస్తున్నట్లు వివిధ న్యూస్ ఛానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో తేలింది. మహారాష్ట్రలో బిజెపి -శివసేన కూటమికి టివి9 మరాఠీ ఛానల్ కనిష్టంగా 197 సీట్లు వస్తాయని చెప్పింది. గరిష్టంగా 243 సీట్లు వస్తాయని సిఎన్ఎన్ న్యూస్ 18 – ఇప్సోస్ సర్వే చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం శాసనసభలో బిజెపి – శివసేన కూటమికి 217 సీట్లు ఉన్నాయి. మొత్తం 11 సర్వేల సగటు తీస్తే దీనికి కాస్త తక్కువగా వస్తాయని తేలింది.
ఇక హర్యానాలో కూడా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ నాయకత్వంలో బిజెపి మళ్లీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 90 స్థానాల అసెంబ్లీలో బిజెపి విజయం తధ్యమని ఏడు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. వాటిలో ఒకటి బిజెపికి 66 సీట్లు వస్తాయంటే మరొక సర్వే 80 సీట్లు వస్తాయని తేల్చింది. క్రితం ఎన్నికలలో బిజెపికి 48 సీట్లు కాంగ్రెస్కు 17 సీట్లు వచ్చాయి. హర్యానాలో ఎగ్జిట్ పోల్ సర్వేలు గురి తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.