(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మరోసారి నిరాశే మిగలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయి… కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా అర్హత సాధించలేని స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి… తాజాగా హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బే తగలనుంది. ఈ మేరకు ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేశాయి. ఊహించినట్లే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ జయభేరి మోగించబోతోందని… పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడ్డ వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను, దాని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. అయినా, ఆ ఓటమి నుంచి ఎలాంటి గుణపాఠమూ నేర్చుకోని కాంగ్రెస్… అదే నాయకత్వలోపంతోనే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో తిరిగి ప్రజల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఎగ్జిట్ పోల్ సర్వేల ద్వారా తెలుస్తోంది. బీజేపీ తరఫున ఈ రెండు రాష్ర్టాల్లో ప్రచారం చేసిన మోదీ.. ప్రధాన ఆకర్షణగా నిలవగా, కాంగ్రెస్కు అంత స్థాయిలో ఆకర్షణ గల నేత కరువయ్యారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రచారానికి రాలేదు. రాహుల్ ప్రచారం చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఖచితంగా చెప్పాలంటే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందు సన్నాహకంగా సెమీఫైనల్స్ పేరుతో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొంది. అధికార బీజెపీకి దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. కమలనాథులు అధికారంలో ఉన్న మూడురాష్ట్రాలలో పాగా వేసింది. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని హస్తగతం చేసుకొంది. బీజెపీ పాలిత మూడు రాష్ట్రాలలోనూ తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్ష కాంగ్రెస్ తన విజయానికి మెట్లుగా చేసుకుంది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీతో విపక్ష పార్టీలన్నీ కకావికలమైపోయాయి. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా నరేంద్రమోదీ నాయకత్వానికి యావత్ భారతావని జేజేలు కొట్టింది. ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో తమ అభిమానాన్ని ఓటర్లు చాటారు. మోదీ తప్ప మరెవరినీ నమ్మబోమంటూ ఢంకా బజాయించారు. ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ ఆత్మ పరిశీలన, సమీక్ష ఏమీ చేయలేదు. ఎందుకు ఓడిపోయామో కూర్చుని మాట్లాడకోలేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. రాహుల్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో ఒక శూన్యత ఏర్పడింది. అయితే, పార్టీ అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ తాత్కాలికంగా స్వీకరించారు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండానే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల బరిలో దిగింది. దీంతో ఆపార్టీ ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎంతో ప్రభావం చూపే అవకాశం ఉంది. పోటీ అన్న తరువాత అందరూ గెలవలేరు కాబట్టి ఓటమి భరించే వారి భవిష్యత్ పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ నెల 24వరకు ఆగాలి. ఈ ఫలితాలతో ఏం జరగనుంది? తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కాలమే చెప్పాలి.