న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ప్రతిపక్షాల భేటీకి తాను రావడం లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాలతో తాను సమావేశం అవుతానన్న వార్తలను ఆమె ఖండించారు. మాయావతి లక్నోలోనే ఉంటారని, ఢిల్లీలో ఆమె కార్యక్రమాలు ఏమీ లేవని ఆమె సన్నిహిత సహచరుడు సతీష్ చంద్ర మిశ్రా తెలిపారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ముందుగానే మాయావతి ఢిల్లీలో రాహుల్, సోనియాలను కలుస్తారని పలువురు భావించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరినీ కలిసి ఈ సమావేశం ఏర్పాటుచేశారన్నారు. లక్నోలో మాయవతిని కలవడానికి ముందు, తర్వాత రెండుసార్లు ఆయన రాహుల్ గాంధీతో చర్చించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా ఆయన కలిసే అవకాశముంది.
మాయావతిని ఆయన విపక్షాల చర్చకు తీసుకురాగలిగితే అది పెద్ద విజయమే అవుతుంది. యూపీ ప్రచారంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీపైనా మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఆమె అలా వ్యవహరించారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు మరో భారీ విజయం దక్కుతుందనే జోస్యం చెప్పాయి. ఎన్డీయేకు 303 స్థానాలు, యూపీయేకు 122 మాత్రమే వస్తాయని, ఇతరులంతా కలిపి 117 దాటకపోవచ్చని అన్నాయి.
80 స్థానాలున్న యూపీలో ఎస్పీ- బీఎస్పీ కూటమికి మహా అయితే 30 దాటవని కూడా పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి అక్కడ తగ్గే స్థానాలు పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో కలిసొస్తాయని అంటున్నారు. అందుకే తదుపరి చర్యలు తీసుకోడానికి ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఆగాలని మాయావతి భావిస్తున్నారు.