- సోషల్ మీడియాలో వదంతుల వ్యాప్తి
- బాలాకోట్ వైమానిక దాడులపై ఇష్టారాజ్యం
- తోచిన వీడియోలు.. ఫొటోలు షేర్ చేయడమే
- భారత్, పాకిస్థాన్ రెండు దేశాలలో ఇదే తీరు
- నాయకుల ప్రచారం.. దుష్ప్రచారానికీ ఆయుధం
(అర్జున్ సిద్దార్థ్)
మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సమాచారంలో ఏది ఒప్పో, ఏది తప్పో తెలుసుకోవడం కష్టమవుతోంది. నిజాల కంటే అబద్ధాలు చాలా త్వరగా వ్యాపిస్తున్నాయి. తప్పుడు సమాచారం నిమిషాల మీద లక్షలాది మందికి చేరిపోతోంది. ఫిబ్రవరి నెలలో ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. భారత వైమానిక దళాలు పాకిస్థాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో జైషే మహ్మద్ స్థావరాలను ఫిబ్రవరి 27 తెల్లవారుజామున ధ్వంసం చేశాయి. అప్పటినుంచి సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులకు అంతులేదు. ప్రధానస్రవంతి మీడియాకూ ఇవి అంటుకున్నాయి. ఈ విషయాలను ‘ఆల్ట్ న్యూస్’ బయటపెట్టింది. కొన్ని ఉదాహరణలను తీసుకుని వాటి అసలు రంగు ఏంటో ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది.
వీడియోగేమ్ చూపించి…
భారత వైమానికదళం దాడులు చేసిన తర్వాత వెంటనే ఒక వీడియో గేమ్ వైరల్ అయింది. దాన్నే జైషే శిబిరం మీద జరిగిన దాడిగా ప్రచారం చేసేశారు. ఖబర్ ఉత్తరాఖండ్ అనే ఒక హిందీ మీడియా సంస్థ ఈ వీడియోను ‘ఎక్స్క్లూజివ్’ అంటూ పెట్టింది. గట్టిగా పట్టి చూస్తే అసలు ఇది నిజం కాదని ఎవరికైనా తెలుస్తుంది. వెనకాల వస్తున్న ఇంగ్లీషు కామెంట్రీ మరిన్ని అనుమానాలకు దారితీసింది. యూట్యూబ్ మొత్తం గాలిస్తే.. 2015నాటి ‘ఆర్మా 2’ అనే వీడియో గేమ్ క్లిప్పింగ్ అని తేలింది. అప్పుడే ఈ వీడియోగేమ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్నే తీసుకున్నారు.
పాత వీడియో..
వైమానిక దాడులు జరిగిన సందర్భంలోనే మరో వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. అజయ్ కుష్వాహా అనే ట్విట్టర్ యూజర్ తన టైంలైనులో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అతడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఫాలో అవ్వడం విశేషం.
India strikes again. This is new India under Leadership of Honourable PM Shri @narendramodi ji. India's airforce destroyed terrorist camps in Pakistan and more than 200-300 militant have been killed According to souces.
@ImranKhanPTI how's the josh ??#Balakot #SurgicalStrike2 pic.twitter.com/8FRaUK3TfK— Ajay Kushwaha ?? (@AjayKushwaha_) February 26, 2019
ఆ వీడియో పాకిస్థాన్ నుంచే వచ్చిందని చాలామంది కామెంట్లు చేశారు. ‘ఇస్లామాబాద్ పీఏఎఫ్ ఫ్లై పాస్ట్ ఫ్లేర్స్’ అని యూట్యూబులో వెతికితే, 2016 సెప్టెంబరు నాటి వీడియోగా అది బయటపడింది. అప్పట్లో మహ్మద్ జొహైబ్ అనే యూజర్ దాన్ని పోస్ట్ చేశారు.
భూకంపం ఫొటోలు చూపించి..
భారత వైమానికదళం హతమార్చిన ఉగ్రవాదుల శవాల ఫొటోల కోసం చాలామంది ప్రయత్నించారు. కొన్నాళ్లకే సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఫొటోలు వచ్చిపడ్డాయి. ‘పుల్వామా ఫొటోలు చాలా చూశాం.. ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి చూడండి’ అని కేప్షన్ పెట్టారు. కానీ గూగుల్ ఇమేజి సెర్చిలో చూస్తే, అవి 2005నాటి భూకంపం ఫొటోలని తేలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో వచ్చిన భూకంపంలో భారీ సంఖ్యలో జనం మరణించారు. పాక్ ఉత్తరప్రాంతాలు, అఫ్ఘానిస్థాన్, భారతదేశాల్లోనూ ప్రభావం చూపింది. అవి నాటి ఫొటోలేనని బీబీసీ తెలిపింది.
పాక్ సోషల్ మీడియాదీ అదే తీరు
వైమానిక దాడుల సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఒక విమానం కూలిపోయింది. కాసేపటికే పాకిస్థానీ సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొట్టింది. పాకిస్థానీ ఫైటర్ జెట్ విమానం భారతీయ విమానంపై బాంబులు వేస్తున్నట్లు ఆ 30 సెకండ్ల వీడియోలో ఉంది. దానికి పాక్ ఆర్మీ జిందాబాద్ లాంటి పలు హ్యాష్ ట్యాగులు పెట్టారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు మియా జావేద్ లతీఫ్ కూడా దాన్ని షేర్ చేశారు.
https://twitter.com/javedlatifMNA/status/1100745875071139840
కానీ దాన్ని రివర్స్ సెర్చ్ చేస్తే రెండు వేర్వేరు వీడియోలను ఉపయోగించి చేసినట్లు తేలింది. మొదట ఫైటర్ జెట్ లో పైలట్ ఉన్న దృశ్యాన్ని 2015 నాటి పాక్ రక్షణశాఖ యూట్యూబ్ చానల్ నుంచి తీసుకున్నారు. రెండో క్లిప్ ఆర్.టి. న్యూస్ 2015లో పెట్టిన క్లిప్ లోది. రాయల్ డేనిష్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాల్లో భాగంగా ఒక డ్రోన్ ను గైడెడ్ మిసైళ్లతో కాల్చిన దృశ్యమది.
సూరత్ అమ్మాయి పాల్గొందని..
ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర మీడియాల్లో భారతవైమానిక దాడుల్లో సూరత్ అమ్మాయి పాల్గొందని ప్రచారమైంది. సూరత్ లోని భుల్కా భవన్ స్కూల్లో చదివిన ఊర్విశ జరీవాలా అని చెప్పారు. రాజస్థాన్ కు చెందిన బీజేపీ నేత రితల్బా సోలంకి కూడా ఈ విషయం చెప్పారు. కానీ ఊర్విశ జరీవాలా, లేదా ఊర్వశి జరివాలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని సెర్చ్ చేస్తే ఏమీ రాలేదు. ధాంతో ఆమె ఫొటోను సెర్చ్ చేస్తే, స్నేహా షెకావత్ అనే పైలట్ అని తేలింది. ఆమె రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొన్నప్పటి ఫొటో అది.
బెంగళూరులో గాయపడితే..
బాలాకోట్ లో భారత వైమానిక దాడులు జరిగిన తర్వాత గాయపడ్డ భారత పైలట్ అంటూ పాక్ సోషల్ మీడియా ఓ వీడియో షేర్ చేసింది. దాన్ని కేవలం పాక్ ఆర్మీ ఫేస్బుక్ పేజి నుంచే ఏకంగా 18వేల సార్లు షేర్ చేసుకున్నారు. కానీ దాన్ని చూస్తే, 2019 ఫిబ్రవరి 19న బెంగళూరులో జరిగిన ఏరోషో సందర్భంగా రెండు సూర్యకిరణ్ విమానాలు ఢీకొన్నాయి. వాటిలో ఒక పైలట్ మరణించగా ఇద్దరు గాయపడ్డారు. దాన్నే పాకిస్థాన్ వాళ్లు అభినందన్ వర్ధమాన్ వీడియోగా చూపించారు.
2nd Indian Pilot Arrested Alive… pic.twitter.com/TaYWNCCljY
— Dr Shahid Masood (@Shahidmasooddr) February 27, 2019
ప్రధాన స్రవంతి మీడియాలోనూ..
పాకిస్థానీ ఫైటర్ జెట్లు ఫిబ్రవరి 27న జమ్ము కశ్మీర్ గగనతలాన్ని దాటి వచ్చాయి. వాటిని భారత వైమానిక దళం తరిమికొట్టింది. కానీ పాక్ మీడియా మాత్రం దాన్ని వెనక్కి తిప్పి చూపించింది. భారత ఫైటర్ విమానాలు వస్తే పాక్ వైమానిక దళం తరిమేసినట్లు చూపించింది. భారత వైమానిక దళ జెట్లను కాల్చినట్లుగా పదే పదే వీడియోలను ప్రసారం చేసింది.
ఒడిశా విమానం చూపించి…
‘‘పాకిస్థానీ గగనతలంలో రెండు భారతీయ విమానాలను పాకిస్థానీ వైమానిక దళం కూల్చేసింది’’. ఇదీ పాకిస్థాన్ పత్రిక డాన్ పతాక శీర్షికలలో చేసుకున్న ప్రచారం. ఒక పైలట్ మరణించారని కూడా అందులో చెప్పారు. విమానం కూలిపోయి ఉండగా చుట్టూ జనం ఉన్న ఫొటోను దానికి వాడారు. ఇరాన్ దేశానికి చెందిన ప్రెస్ టీవీ కూడా అదే ఫొటోను ప్రచురించింది. కానీ, ఆ ఫొటో మాత్రం మూడేళ్ల క్రితం నాటిది. భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం ఒడిశాలో 2015 అక్టోబరులో కూలిపోయింది. దాన్నే తాము కూల్చిన విమానంగా పాకిస్థాన్ ప్రచారం చేసుకుంది.
పుల్వామా ఆత్మాహుతి దళ సభ్యుడితో రాహుల్
పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాల మీద ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ దార్ గుర్తున్నాడా? అతడు గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఉన్నట్లు ఓ ఫొటో వైరల్ అయింది. కానీ ఆ ఫొటోను జాగ్రత్తగా చూస్తే ఫొటోషాప్ ద్వారా మార్చినట్లు సులభంగా తెలుస్తుంది. దాన్ని గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తే కాంగ్రెస్ టోపీ ధరించి, కళ్లజోడు పెట్టుకున్న వ్యక్తి ఫొటోలో తల తీసి దార్ తల పెట్టినట్లు అర్థమైంది.
మోదీ.. నితీష్ నవ్వులు
పుల్వామా ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఒకవైపు సైనికులు మరణిస్తే మరోవైపు మోదీ, నితీష్ కుమార్ నవ్వినట్లు ట్విట్టర్ లో కనిపించింది. యువజన కాంగ్రెస్ సభ్యురాలు ఆర్తి ఈ ఫొటో పెట్టారు. కానీ ఆ ఫొటోను గూగుల్ ద్వారా వెతికితే, 2015 జూలై 26నాటిదని తేలింది. పట్నాలో ఓ రైల్వే ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా వారి నవ్వులవి. బిహార్ ఎన్నికలకు కొద్ది ముందు తీసిన ఫొటో అది.
కుంభమేళాకు తొలి ప్రధాని..
ప్రధానమంత్రి మోదీ నరేంద్రమోదీ ఫిబ్రవరి 24వ తేదీన కుంభమేళాలో పాల్గొని గంగానదిలో పవిత్ర స్నానం చేశారు. ఆ వెంటనే బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ ఒక ట్వీట్ చేశారు. కుంభమేళాకు హాజరైన తొలి ప్రధాని మోదీ అని అందులో ఆయన రాశారు. కానీ.. చాలా సంవత్సరాలకు ముందే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తొలిసారిగా కుంభమేళాలో పాల్గొన్నారని వాస్తవాలు చెబుతున్నాయి.
(ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో)