బీబీసీ సర్వే పేరుతో అసత్య వార్తలు
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ భారతదేశంలో ఎన్నికలకు ముందు ఓ సర్వే చేసిందని, అందులో బీజేపీ 2014 నాటి ఫలితాల కంటే మెరుగుపడి మరీ అధికారంలోకి వస్తున్నట్లు తేలిందని ఓ వార్త ప్రచారం అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది.
@SMHoaxSlayer @boomlive_in @QuintFactCheck @AltNews kindly check this viral msg…. looks suspect. pic.twitter.com/egdmZKEBRp
— Ashes to ashes (@i_am_ashes) April 9, 2019
దీని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కనీసంలో కనీసం వేసుకున్నా కూడా బీజేపీ 323 స్థానాలు గెలుచుకుంటుందని, ఒకవేళ బాగా వస్తే 380 సీట్లు వస్తాయని కూడా అందులో చెప్పారు. బీబీసీ హోం పేజీ లింకును కూడా అందులో ఇచ్చారు. వాళ్లు చెప్పిన ప్రకారం అందులో వివరాలు ఇలా ఉన్నాయి..
2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ సీట్లు పెంచుకుంటుందని సీఐఏ, ఐఎస్ఐ సర్వే తేల్చింది..
బీజేపీ ప్రదర్శన బాగోకపోతే = 332 స్థానాలు
బీజేపీ ప్రదర్శన బాగుంటే = 380 స్థానాలు
రాష్ట్రం (స్థానాలు) కనీసం – గరిష్ఠం
◆ ఆంధ్రప్రదేశ్ (25) = 3 – 4
◆ అరుణాచల్ ప్రదేశ్ (2) = 2 – 2
◆ అసోం (14)= 8 – 10.
◆ బిహార్ (40) = 30 – 35
◆ ఛత్తీస్ గఢ్ (11) = 6 – 8
◆ గోవా (2) = 2/2
◆ గుజరాత్ (26) = 24 – 25
◆ హర్యానా (10) = 6 – 8
◆ హిమాచల్ ప్రదేశ్ (4) =4 – 4
◆ జమ్ము కశ్మీర్ (6) = 3 – 3
◆ జార్ఖండ్ (14) = 8 – 10
◆ కర్ణాటక (28) = 24 – 25
◆ కేరళ (20) = 2 – 3
◆ మధ్యప్రదేశ్ (29) = 24 – 25
◆ మహారాష్ట్ర (48) = 36 – 38
◆ మేఘాలయ (2) = 1 – 1
◆ మిజోరం (1) =1
◆ మణిపూర్ (2) = 1
◆ నాగాలాండ్ (1) =1
◆ ఒడిషా (21) = 8 – 10
◆ పంజాబ్ (13)= 5 – 6
◆ రాజస్థాన్ (25) = 20 -24
◆ సిక్కిం (1) = 1
◆ తమిళనాడు (39) = 28 – 30
◆ తెలంగాణ (17) = 1 – 2
◆ త్రిపుర (2) = 2
◆ ఉత్తరప్రదేశ్ (80) = 45 – 70
◆ ఉత్తరాఖండ్ (5) = 5
◆ పశ్చిమబెంగాల్ (42) = 10 – 12
◆ అండమాన్ నికోబార్ (1) = 1
◆ చండీగఢ్ (1) =1
◆ దాద్రానగర్ హవేలి (1) =1
◆ డామన్ డయ్యు (1) = 1
◆ లక్షద్వీప్ (1) = 1
◆ ఢిల్లీ (7) = 6 – 7
◆ పాండిచ్చేరి (1) =1
* ప్రస్తుతం దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ*
.. ఇదీ ఆ సందేశం సారాంశం.
ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అమెరికా నిఘా సంస్థ సీఐఏ, పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సంయుక్తంగా ఈ సర్వేను భారతదేశంలో చేసినట్లు చెప్పారు. ఇదే సందేశం మరో వ్యాఖ్యతోనూ వచ్చింది. ‘‘బీబీసీ బ్రిటిష్ చానల్ సర్వేలో ఆశ్చర్యకర ఫలితాల వెల్లడి’’ అని దీన్నే పంపారు. బీబీసీ హోం పేజీ లింకు కూడా ఇవ్వడంతో నిజంగా సర్వేను బీబీసీ చేసిందా అన్నట్లు అనిపించేలా చూశారు. చాలామంది వ్యక్తులు దీన్ని కాపీ చేసి, తమ ఫేస్ బుక్ టైం లైను మీద పెట్టుకున్నారు.
సర్వే చేసిందీ లేదు…
నిజానికి ఈ సందేశం అంతా కట్టు కథ. అసలు బీబీసీ ఎప్పుడూ ఇలా ఎన్నికల ముందు సర్వేలు చేయలేదు. అసలు భారతదేశంలో సర్వేలు బీబీసీ చేయలేదు. ‘‘వాట్సాప్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలలో బీబీసీ సర్వే అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అది పూర్తిగా బూటకం, బీబీసీ నుంచి రాలేదని స్పష్టం చేస్తున్నాము. భారతదేశంలో ఎన్నికల ముందు సర్వేలను బీబీసీ ప్రోత్సహించదు’’ అని బీబీసీ అధికార ప్రతినిధి ఒకరు ఆల్ట్ న్యూస్ కు చెప్పారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే బీబీసీ లోగోను ఉపయోగించుకుని తప్పుడు సర్వే ఫలితాలు ప్రచారం చేశారు.