పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర పెనుతుపాను ఫోని ఒడిశా తీరంవైపుగా దూసుకు వెళుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఒడిశాలోని పూరికి 730 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఇది కేంద్రీకృతమై ఉందని వెల్లడిస్తున్నారు.
ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర పెనుతుపాను ఫోని నేడు మధ్యాహ్నం తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా తీరం వెంబడి కదులుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. మే మూడవ తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని గోపాల్ పూర్- చాంద్ బలీల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఇది తీరాన్ని దాడే సమయంలో గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
తీవ్ర పెనుతుపాను ఫొని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలియజేసింది. నేటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఒడిశాతో పాటు బెంగాల్ రాష్ట్రంలోనూ చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలియజేసింది. ఒడిశాలో 20 సెంటి మీటర్ల కంటే అధికంగా వర్షపాతం చాలా చోట్ల నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో గాలుల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని గంటకు 195 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం నుంచి తీరప్రాంతాల్లో గాలుల ఉద్ధృతి పెరగనుంది. ప్రచండమైన గాలుల కారణంగా అలల ఉద్ధృతి పెరుగుతుందని దాదాపు 1.5 మీటర్ల ఎత్తున తీర ప్రాంతాల్లో అలలు ఎగసి పడతాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఒడిశాలోని గంజాం, పూరి, ఖుర్ధా, జగత్సింగ్ పూర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకుని రావొచ్చని ఐఎండీ స్పష్టం చేసింది. తుపాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశాలలో విద్యుత్ లైన్లు, సెల్ ఫోన్ టవర్లు , కచ్చా ఇళ్లు నేలకూలే ప్రమాదముందని ఐఎండి హెచ్చరించింది.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలుగా 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను , 34 బోట్లను , 116 రహదారి క్లియరెన్సు బృందాలను పంపించారు.
కాగా ఒడిశాలోని పొని ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేతకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 11 తీర ప్రాంత జిల్లాల్లో నియమావళిని ఎత్తివేశారు. పూరీ, కేంద్రపడ, భద్రక్, బాలసోర్, మయూర్బంజ్, గజపతి, గంజాం, ఖుర్ధా, కటక్, జూజ్పూర్ జిల్లాలు ఎన్నికల కోడ్ ఎత్తివేసిన వాటిలో ఉన్నాయి.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ పరిస్థితులను సమీక్షించి చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.