విశాఖ: ఫోని తుఫాను విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 230కిలో మీటర్ల దూరంలో, బెంగాల్లోని దిగాకు 700కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లా తీరానికి కాస్త దగ్గరగా శ్రీకాకుళం జిల్లా తీరానికి కేవలం 40నుండి 50కిలో మీటర్ల దూరం నుండే ఈ తుఫాను ఒడిశా వైపుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి ఉత్తర ఈశాన్య దిశగా తుఫాను బుధవారం సాయంత్రం మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఈశాన్య దిశలోనే కదులుతూ గంటకు ఏడు కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 300 కిలో మీటర్ల వరకూ ప్రచండగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఫొని తుఫానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఒకటిన్నర మీటర్ల ఎత్తుల అలలు తీరాన్ని తాకుతున్నాయి.
కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో పదవ నెంబర్, విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవులో ఎనిమిదవ నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పది జిల్లాలలో ఫొని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను దృష్యా ఈస్ట్ కోస్టు రైల్వే 11 రైళ్లను రద్దు చేసింది. విశాఖలో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇండిగో ఎయిర్ లైన్స్ 11 విమానాలను రద్దు చేసింది.