హైదరాబాద్: మూడేళ్ల క్రితం టాలీవుడ్లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇంతవరకు కోర్టుకు మాత్రం డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక నివేదిక చేరలేదు. దీంతో డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి.
2017లో డ్రగ్స్ కేసు టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. ఎందరో అగ్రతారలు డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం జరగడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై ఎక్సైజ్ అధికారులు పలువురు సెలబ్రిటీలను విచారణ చేశారు. పోలీసులు విచారించిన వారిలో ప్రముఖ డైరెక్టర్లు, హీరో, హీరోయిన్లు కూడా ఉన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. ఆ విచారణలో ఏం తేలింది..? విచారణకు హాజరైన వారంతా డ్రగ్స్ తీసుకున్నారా ? ఈ స్కామ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ? కేసు విచారణ ముగిసిందా ? ఇంకా సాగుతూ ఉందా ? అనేది ఎటూ తేలలేదు. అయితే, సమాచార హక్కు చట్టంతో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగు చూశాయి.
డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 4 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కేసులు నమోదు చేసి… సినీనటులు, దర్శకులు, సహా 62 మందిని విచారించినట్లు తెలిపారు. సినీ ప్రముఖులను విచారించి, వారి నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు… వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్లో చేర్చలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే నిందితులందరినీ బాధితులుగా పేర్కొన్నారు. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
హైదరాబాద్లోని పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తూ కెల్విన్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. విచారణ సందర్భంగా తనకున్న లింకులన్నీ బయటపెట్టాడు. అతని ఫోన్లో సినీ ప్రముఖుల నెంబర్లు ఉన్నాయి. మొత్తం 62 మంది ప్రముఖుల పేర్లను అధికారులు బయటకు తీశారు. అందులో 11 మంది సినీ పరిశ్రమకు చెందిన ఉన్నారు. వారందరినీ విచారణకు పిలిచారు. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నందు, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, చిన్నా, చార్మీ, ముమైత్ ఖాన్ ఉన్నారు. వీరిందరికీ నోటీసులు ఇచ్చి మరీ… రోజుకొకరు చొప్పున 11 రోజుల పాటు అందరినీ విచారించారు. నిందుతుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకుల నమూనాలను సేకరించారు. ఈ కేసులో ఎవ్వరినీ వదలి పెట్టేది లేదని అప్పట్లో ఎక్సైజ్శాఖ అధికారులు బలంగా చెప్పారు.