న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన లా విద్యార్థిని వ్యవహారం మరో మలుపు తిరిగింది. చిన్మయానంద్ తనపై ఏడాది నుంచి అత్యాచారానికి పాల్పడినట్టు ఆ విద్యార్థిని ఆరోపించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్మయానంద్ పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని.. మొత్తం 12 పేజీలతో కూడిన వివరాలను అందజేసినట్టు సమాచారం. సిట్ అధికారులు తనను ఎన్ని గంటలు విచారించినా ఇబ్బంది లేదు, కానీ నిందితుడిని అరెస్ట్ చేయాలని బాధిత యువతి డిమాండ్ చేసింది. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడానికి ముందు ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
గత ఏడాది జూన్లో షాహజాన్పూర్ కాలేజీలో చేరే ముందు చిన్మయానంద్ను కలిశానని తెలిపింది. అప్పుడే ఆయన తన ఫోన్ నంబర్ తీసుకున్నాడని.. కాలేజీ లైబ్రరీలో రూ.5 వేల ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారని ఆమె పేర్కొంది. మొదట హాస్టల్లో సీటు ఇప్పించాడని.. ఆ తర్వాత ఆశ్రమానికి రమ్మన్నాడని తెలిపింది. అయితే, హాస్టల్లో స్నానం చేస్తుండగా.. వీడియో తీసి తనను బ్లాక్మెయిల్ చేశాడని, ఆ తర్వాత రేప్ చేసి వీడియో తీసి కూడా పదేపదే అత్యాచారం చేశాడని తెలిపింది. చిన్మయానంద్కు మసాజ్ చేయాలని అతని గన్మన్లు తరచూ గన్ ఎక్కుపెట్టి బెదిరించారని వివరించింది. దీనికి సంబంధించి తన దగ్గర పక్కా ఆధారాలున్నాయని, సాక్ష్యాలను తగిన సమయంలో సిట్కు అందజేస్తానని ఆమె తెలిపింది.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్కు చెందిన ఈ లా విద్యార్థిని.. స్వామి చిన్మయానందపై లైంగిక వేధింపులు చేసిన విషయం తెలిసిందే. అగస్ట్ లో తన ఫేస్బుక్లో ఆరోపణలు చేసిన తర్వాత ఆమె వారం రోజుల పాటు కనిపించకుండాపోయింది. దీంతో ఆమెను చిన్మయానందే కిడ్నాప్ చేయించారని ప్రచారం జరిగింది. అయితే వారం రోజుల తరువాత యూపీ పోలీసులు ఆమె రాజస్థాన్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో, ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు.. బాధితురాలిని తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. రాజస్థాన్ నుంచి పోలీసులు ఆ యువతిని షాజహాన్పూర్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు.
వేధింపుల అంశాన్ని సుప్రీం కోర్టు సుమోటగా స్వికరించింది. విచారణ అనంతరం కేసుకు సంబంధించి సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మూడు రోజుల క్రితం సిట్ అధికారులు విద్యార్థినిని 15 గంటలపాటు విచారించారు. అత్యాచారం సహా అన్ని విషయాలను వారికి వెల్లడించినప్పటికీ చిన్మయానంద్ ను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని ఆమె పేర్కొంది. ఇది ఇలాఉంటే.. ఆ యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని చిన్మయానంద్ ఆరోపించారు. ఈ కేసులో తనను కావాలనే ఇరికిస్తున్నారని ఆయన అంటున్నారు. ఆ విద్యార్ధిని చిన్మయానంద్ పై అసత్య ఆరోపణలు చేస్తోందని చిన్మయానంద్ తరుపు లాయర్ అన్నారు.