ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 32మంది మృతి చెందారు. రాణి ఝాన్సీ రోడ్డులో అనాజ్ మండీలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భనవంలో నివసిస్తున్న 43 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకొని 27 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. గాయపడిన వారిని లోక్నాయక్ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది 52 మందిని సురక్షితంగా కాపాడారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇరుకైన ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో మంటలు చెలరేగడంతో ఊపరి ఆడక పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో ఇంకా దట్టమైన పొగలు కమ్ముకునే ఉన్నాయి. మంటలు అదుపులోనికి వచ్చాయనీ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ డిప్యూటీ చీప్ ఫైర్ అధికారి సునీల్ చౌదరి తెలిపారు. భవనంలో ఫ్యాక్టరీ నడుస్తోందనీ, అక్కడే సిబ్బంది రాత్రి నిద్రించిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి కారణాలు, ఎంత ఆస్తినష్టం జరిగి ఉండవచ్చనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
భారీ అగ్నిప్రమాదంలో 43 మంది మృతి చెందడంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులు త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ట్వీట్ చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను అదేశించారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.