- నేను రాజీనామా చేయడం ఖాయం
- కాంగ్రెస్ పెద్దలకు రాహుల్ స్పష్టీకరణ
సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురవ్వడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటానన్న రాహుల్ గాంధీ.. తన నిర్ణయంపై గట్టిగా నిలబడ్డారు. పార్టీ అధ్యక్ష పదవికి వేరే ఎవరినైనా వెతుక్కోవాలని సీనియర్ సహచరులకు స్పష్టం చేశారు. వారసుడు దొరికేవరకు మాత్రమే తాను ఉంటానన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను చేపట్టేందుకు ఎవరు ముందుకొస్తారన్న అనుమానం చాలామందిలో ఉంది. పార్టీని పునర్నిర్మించేందుకు వీలుగా తన రాజీనామాను ఆమోదించాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు.
పీసీసీ చీఫ్ ల రాజీనామాలు
ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఝార్ఖండ్ పీసీసీ చీఫ్ అజోయ్ కుమార్ రాజీనామా చేయగా.. మరికొందరు పీసీసీ అధ్యక్షులు సునీల్ జాఖడ్ (పంజాబ్), రిపున్ బోరా (అసోం), అశోక్ చవాన్ (మహారాష్ట్ర) కూడా దిగిపోతామని చెప్పారు. ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాహుల్ గాంధీని కలిశారు. అయితే, వాళ్లెంత నచ్చజెప్పినా రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు. వాళ్లనే వారసుడిని వెతకాల్సిందిగా కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని, తర్వాత పూర్తిగా పార్టీ పునర్నిర్మాణంపైనే దృష్టి పెడతానని ఆయన అన్నారు. రాహుల్ రాజీనామా నిర్ణయాన్ని సీడబ్ల్యుసీ ఇప్పటికే తిరస్కరించింది. ఆయనకు నచ్చజెప్పేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఆయన తప్పుకోవడం సరికాదని కూడా అంటున్నారు. పార్టీని ప్రతి స్థాయిలో పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని సీడబ్ల్యుసీలో చెప్పినా, అది చెప్పినంత సులభం కాదని పాత అనుభవాల దృష్ట్యా తెలుస్తోంది.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ సీనియర్లు కలవరపడుతున్నారు. ఇప్పటికే అశోక్ గెహ్లాట్ సర్కారులోని ఇద్దరు మంత్రులు సీఎంపై విమర్శలు గుప్పిస్తుండటంతో నష్ట నివారణ చర్యలను పార్టీ మొదలుపెట్టింది. కొడుకుల కోసం పార్టీని పణంగా పెట్టారని ముగ్గురు ముఖ్యమంత్రులను రాహుల్ తప్పుబట్టిన తర్వాతి నుంచి మంత్రుల విమర్శలు ఎక్కువయ్యాయి.