(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా వైరస్’ ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ధృవీకరించింది. కేరళ విద్యార్థికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు వెల్లడించింది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతోన్న ఓ విద్యార్థి ఇటీవల కేరళకు వచ్చారు. కరోనా వైరస్ పుట్టింది కూడా వుహాన్ నగరంలోనే. కరోనా ప్రభావంతో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతుండడంతో.. అతడు ఇటీవలే కేరళలోని స్వస్థలానికి చేరుకున్నాడు. అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. భారత్లో నమోదైన తొలి కరోనావైరస్ కేసు ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే కరోనా వైరస్ సోకిందని అనుమానం వ్యక్తమవుతోన్న కొందరిని పలు రాష్ట్రాల్లో వైద్యులు పరీక్షిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.
మరోవైపు జీవనోపాధి కోసం మలేషియా వెళ్లిన ఓ భారతీయుడు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. త్రిపురకు చెందిన వ్యక్తి కరోనా వైరస్ ప్రభావంతో మలేసియాలోని ఓ ఆస్పత్రిలో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనను భారత్కు రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. త్రిపురలోని పురాతల్ రాజ్నగర్ ప్రాంతానికి చెందిన మనీర్ హుస్సేన్ (23) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లాడు. అక్కడే ఓ రెస్టారెంట్ లో పని చేసుకుంటున్న ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే, ఆయన మృతి చెందినట్లు అక్కడి అధికారులు ఆయన తాత అబ్దుల్ రహీంకు సమాచారం ఇచ్చారు. బుధవారం మలేసియా అధికారుల నుంచి తమకు సమాచారం వచ్చినట్లు ఆయన వెల్లడించాడు. అయితే ఈ విషయాన్ని భారత విదేశాంగ అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు.
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ మహమ్మారితో చైనాలో ఇప్పటికే 170 మందికి పైగా చనిపోయారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే యూఏఈ, మలేసియా సహా 16 దేశాలకు వ్యాపించింది. వేలాది మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్లోనూ పలు అనుమానిత కేసులు నమోదయినప్పటికీ వ్యాధి నిర్ధారణ కాలేదు. అయితే, తాజాగా కేరళ యువకుడికి వైరస్ ఉన్నట్లు నిర్ధారించడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.