హైదరాబాద్: తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి స్టేషన్లో ఈ కేసు నమోదైంది. శాయంపేట పరిధి గోవిందాపూర్కు చెందిన 24 ఏళ్ల ఏళ్ల యువతి కనిపించడం లేదంటూ ఆమె చిన్నాన్న వరంగల్లోని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గోవిందాపూర్ అనేది శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అయితే, తాజాగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సుబేదారి పోలీసులు తమ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అనంతరం దాన్ని శాయంపేటకు బదిలీ చేశారు. యువతి కాల్ డేటా ఆధారంగా రెండు పోలీస్ స్టేషన్ల వారు కేసును విచారణ జరుపుతున్నారు. తెలంగాణలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సుబేదారి పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు. రెండురోజుల క్రితం ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ సబ్డివిజన్ పరిధిలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.
ఇటీవల తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం తర్వాత మరోమారు ‘జీరో ఎఫ్ఐఆర్’పై డిమాండ్ మళ్లీ తెర పైకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాలన్న డిమాండ్ ప్రియాంకారెడ్డి ఘటనతో ఊపందుకుంది. ఢిల్లీలో నిర్భయ ఉదంతం తర్వాత ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం జీరో ఎఫ్ఐఆర్ కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా ఫిర్యాదుకు వస్తే పోలీసులు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రతి ఎఫ్ఐఆర్ కు ఓ నంబరు కేటాయిస్తారు. ఒకవేళ ఫిర్యాదు ప్రాంతం తమ పరిధిలోది కాదని భావిస్తే నంబరు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దీన్నే ‘జీరో ఎఫ్ఐఆర్’ అంటారు.
సాధారణంగా ఏదైనా ఘటనకు సంబంధించిన కేసుల నమోదు సమయంలో పోలీసులు ప్రాథమికంగా ఘటన జరిగిన ప్రాంతం తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా? రాదా? అన్నది నిర్ధారించుకుంటారు. తమ పరిధిలోకి వస్తేనే కేసు నమోదు చేస్తారు. లేదంటే పలానా స్టేషన్కు వెళ్లాలని సూచిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధన వల్ల నిండు ప్రాణాలే బలి అవుతున్నాయి. ప్రియాంకారెడ్డి ఘటనలోనూ ఇదే జరిగింది. ప్రియాంకారెడ్డి ఆపదలో ఉన్నానని ఇంటికి ఫోన్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శంషాబాద్ ఆర్జీఐఏ, శంషాబాద్ రూరల్ పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈలోగా జరగరాని ఘోరం జరిగి పోయింది. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ప్రియాంక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు స్పందించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిశ కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. శంషాబాద్ ఎస్సై తోపాటు ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లను సీపీ సజ్జనార్ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరణలో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులపై సీపీ చర్యలు తీసుకున్నారు.