(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ తొంభయ్యేళ్ల వృద్ధుడిని కిడ్నాప్ చేయాలి. ముందు ఆయనకు మత్తుమందు ఇచ్చారు. మరి బయటకు ఎలా తీసుకువెళ్లాలి. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ కంటబడింది. ఆ వృద్ధుడిని ఫ్రిజ్లో కుక్కారు. బయటకు మోసుకెళ్లి ఒక టెంపోలో ఎక్కించి తీసుకువెళ్లారు. తర్వాత ఆయనను హతమార్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి అయిదుగురిని అరెస్టు చేశారు.
కృష్ణ ఖోస్లా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆయన ఇంట్లో పని చేసే వ్యక్తి కిషన్ మరో నలుగురి సహాయంతో ఖోస్లాను కిడ్నాప్ చేశాడు. ఒక సంవత్సరంగా కిషన్ ఖోస్లా ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నాడు.
గత శనివారం కిషన్ నలుగురు స్నేహితులను వెంటబెట్టుకుని ఖోస్లా ఇంటికి వెళ్లాడు. వృద్ధ దంపతులకు మత్తుమందు కలిపిన టీ ఇచ్చాడు. వారిద్దరూ స్పృహ కోల్పోయిన తర్వాత ఖోస్లాను ఫ్రిజ్లో కుక్కి బయటక తీసుకువెళ్లారు. ఫ్రిజ్ను మరమత్తుకు తీసుకువెళుతున్నట్లు బయట ఉన్న సెక్యూరిటీకి చెప్పారు.
ఖోస్లా భార్య సరోజ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కిషన్ను పట్టుకున్నారు. సిసి టివి కెమేరాల్లో ఫ్రిజ్ను ఎక్కించి తీసుసువెళుతున్న టెంపో రికార్డయింది. అదే రోజు ఖోస్లాను గొంతు నులిమి చంపినట్లు కిషన్ పోలీసులకు చెప్పాడు. ఖోస్లా తనను చీటికి మాటికీ తిట్టేవాడనీ, అయన ప్రవర్తనతో విసిగిపోయి కిడ్నాప్కు పాల్పడ్డాననీ అతను తెలిపాడు. కిషన్ ఖోస్లా ఇంట్లో నుంచి నగలు, నగదు కూడా దొంగిలించాడు. అయిదుగురునీ పోలీసులు అరెస్టు చేశారు.