(న్యూస్ అర్బిట్ డెస్క్)
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గత మూడు రోజుల నుండి గోదావరికి వరద తాకిడి ఎక్కువైంది. గురువారం వరద ప్రవాహం నిలకడగా ఉండగా పోలవరం ప్రాజెక్టు నుండి 7.29లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 9.90అడుగుల నీటి మట్టం నమోదు అయింది. బ్యారేజ్ వద్ద సుమారు ఎనిమిది లక్షల క్యూసెక్కుల ఇన్ప్లో ఉండగా డెల్టా పంట కాల్వలకు 11వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరో 7.85లక్షల క్యూసెక్కుల నీరు కాటన్ బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసిపోతోంది.
వరద ప్రభావం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని గ్రామాల్లోకి నీరు చేరుతుండగా మరి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని మొత్తం 69 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యాం భద్రత, ఏగువన ముంపును దృష్టిలో ఉంచుకుని స్పిల్వే మార్గం గుండా వరద నీరు మళ్లిస్తున్నారు. వేలేరుపాడు మండలంలోనూ 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాధారణంగా భద్రాచలం వద్ద 40 అడుగులు దాటి వరద వచ్చినప్పుడే గ్రామాలకు వరద ప్రభావం ఉండేదనీ, ఇప్పుడు 36 అడుగులకే ఈ పరిస్థితి వచ్చిదనీ, దీనికి కాఫర్ డ్యాం నిర్మాణమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కాజ్వే వరద నీటిలో మునిగిపోయింది. దీనితో కనకాయలంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలోనూ గోదావరి పాయలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అయినవిల్లి మండలంలోని లంక గ్రామాలకు వరద తాకిడి ఎక్కువైంది. పడవలపై ప్రయాణం ప్రమాదకరమని అధికారులు లంకవాసులకు విజ్ఞప్తి చేశారు. పోశమ్మగండి వద్ద గోదావరి ఉధృతి అధికంగా ఉండటంతో వరద నీరు ఇళ్లను తాకుతూ దిగువకు ప్రవహిస్తోంది. నది ఒడ్డున ఉన్న 20 ఇళ్లలోకి వరద నీరు రావడంతో వారంతా అమ్మవారి ఆలయ సత్రాల్లో తలదాచుకున్నారు. తొయ్యేరు, పూడిపల్లి, పోశమ్మగండి, దేవీపట్నం, అగ్రహారం గ్రామాల్లో వరద బాధితులు సుమారు 1500మందికి భోజనాల ఏర్పాట్లు చేశారు. గోదావరి ఎగువన కచ్చులూరు గిరిజనులు తమ సామాగ్రిని పడవలపై బయట ప్రాంతాలకు తీసుకెళ్లారు. కచ్చులూరు నుండి కొండమొదలు వరకూ ఉన్న 14 గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.