అమరావతి: ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాడిని ఎదుర్కోవడం ఇప్పుడు సిఎం జగన్ వంతయింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కృష్ణారావు అనంతరకాలంలో ఆయన విధానాలపై విమర్శలకు దిగారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను తూర్పారపడుతూ జగన్మోహనరెడ్డికి చెందిన సాక్షి తెలుగు దినపత్రికలో ఆర్టికల్స్ కూడా రాశారు. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ పలు మీటింగ్లలోనూ ఉపన్యాసాలు ఇచ్చారు. తాజాగా జగన్ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి నిరోధక కార్యక్రమాలపై ఆయన విమర్శలు సంధించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఐఐఎం (అహ్మదాబాద్) సహకారంతో సమర్థవంతంగా అవినీతి నిరోధన చర్యలు చేపడుతోందని వెల్లడించిన నేపథ్యంలో ఐవైఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వానికి అయిదు ప్రశ్నలను సంధించారు.
ఇప్పటికే అవినీతి రహిత పాలన అనే అంశం మీద చాలా రిపోర్టులు ఉన్నాయనీ, కావాల్సింది ఇంకొక రిపోర్టు కాదని అన్నారు. చిత్తశుద్ధితో అమలు చేయాలనే సంకల్పం ఉండాలని అన్నారు.
ఐవైఆర్ సంధించిన ప్రశ్నలు:
- పూర్తి అధికారంతో బాధ్యత లేని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వ అవినీతికి మూల బిందువు. ఆ కార్యాలయాన్ని బాధ్యతాయుతంగా చేయటానికి చర్యలు చేపట్టే ఉద్దేశం ఉందా?
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులన్నీ కిందిస్థాయి ఉద్యోగులకే పరిమితమవుతున్నాయి. దీని అర్థం ఉన్నతస్థాయి అధికారులు, మంత్రులు అవినీతి రహితులు అనా?
- కిందిస్థాయిలో జరగాల్సిన నిర్ణయాలు కూడా పై స్థాయికి రావటం ప్రభుత్వంలో మామూలైపోయింది. చిత్తశుద్ధితో అధికార వికేంద్రీకరణ అమలు చేసే ఉద్దేశం ఉందా?
- మాట వినని అధికారులను దారికి తేవడం కోసం అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ శాఖలను ప్రభుత్వాలు ఎక్కువగా వినియోగిస్తున్నాయి కానీ నిజంగా అవినీతిపరులైన అధికారులను శిక్షించడానికి కాదు. ఈ అంశంపై దృష్టి సారించి వాటిని సరైన మార్గంలో పటిష్టం చేసే ఉద్దేశం ఉందా?
- అధికారం పూర్తిగా ముఖ్యమంత్రి, వారి కార్యాలయంలోనే కేంద్రీకృతమైంది. అధికార వికేంద్రీకరణ అంటూ జరిగితే ఇక్కడి నుంచే మొదలవ్వాలి. అధికార కేంద్రీకరణ, అవినీతి ఒకే నాణానికి రెండు ముఖాలు. వికేంద్రీకరణ లేకుండా అవినీతిని కట్టడి చేయడం సాధ్యం కాదు.
ఈ పై అంశాలపై ప్రభుత్వాలకు స్పష్టత ఉన్ననాడు ఐఐఎంల సహాయం ఉన్నా లేకపోయినా అవినీతిని నియంత్రించవచ్చు.
1. పూర్తి అధికారంతో బాధ్యత లేని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వ అవినీతికి మూల బిందువు.ఆ కార్యాలయాన్ని బాధ్యతాయుతంగా చేయటానికి చర్యలు చేపట్టే ఉద్దేశం ఉందా?
2. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులన్నీ కిందిస్థాయి ఉద్యోగుల కే పరిమితమవుతున్నాయి.— IYRKRao , Retd IAS (@IYRKRao) November 19, 2019