న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గుండెపోటుతో శనివారం సాయంత్రం కన్ను మూశారు. ఆమెకు 81 ఏళ్లు. కొద్ది రోజుల క్రితం ఆమెను ఢిల్లీ, ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఈరోజు సాయంత్రం 3.55 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
షీలా దీక్షిత్కు గుండె పోటు వచ్చిందనీ, ఆమెను బతికించేందుకు వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారనీ ఎస్కార్ట్స్ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి ఆమె 2019 ఎన్నికలలో లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు.
షీలా దీక్షిత్ మరణవార్త తనను కలచివేసిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ ప్రియ పుత్రిక. ఆమెతో నాకు సన్నిహితమైన ఆనుబంధం ఉంది అని ఆయన పేర్కొన్నారు.
షీలా దీక్షిత్ మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఢిల్లీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్ నగరం రూపురేఖలు మార్చారని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. ఢిల్లీ అభివృద్ధికి షీలా దీక్షిత్ గణనీయమైన కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కూడా షీలా దీక్షిత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఇందిరా గాంధీ ప్రభుత్వంలో మంత్రి పదవి నిర్వహించిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమా శంకర్ దీక్షిత్ కోడలు షీలా దీక్షిత్. ఆమె మొదటిగా కనోజ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె రాజీవ్ గాంధీ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా రాజకీయాల్లో ఉన్నారు.