అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థపై మాజీ మంత్రి, సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతంగా ఆలోచించుకునే శక్తి ఇవాళ ఉన్న పోలీసు వ్యవస్థకు లేదనీ, ఏవరో చేతిలో కీలుబొమ్మలయ్యారనీ జెసి వ్యాఖ్యానించారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఇటీవల టిడిపి నేత నాగరాజు ఇంటి చుట్టూ వైసిపి నేత పెద్దిరెడ్డి బండలు పాతించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో వైసిపి, టిడిపి నేతల మధ్య రహదారి వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దీంతో బుధవారం ఆ సమస్య తెలుసుకొని పరిష్కరించేందుకు జెసి దివాకరరెడ్డి ఆ పార్టీ నాయకులు కెఇ ప్రభాకర్, యామిని బాల, బండారు శ్రావణి తదితరులతో కలిసి వెంకటాపురం గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసు అధికారులు జెసితో సహా టిడిపి నేతలను అదుపులోకి తీసుకొని బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంలో జెసి పోలీసు వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీపరంగా, కుల పరంగా తాము అక్కడకు వెళ్లడం లేదని జెసి అన్నారు. ఆ స్థలం ఆయన సొంత భూమా లేక ప్రభుత్వ భూమా అన్నది తనకు తెలియదనీ, అయితే ఆయనకు వచ్చే నష్టం ఏమిటో తెలుసుకొని దాన్ని పూరిస్తామని చెప్పి సమస్యను మానవతాదృక్పదంతో పరిష్కరించుకోవాలని సూచన చేయాలని వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని జెసి అన్నారు. పెళ్లిళ్లు చేసుకుంటున్నప్పుడు అడ్డురాని కులం, మతం ఇప్పుడెందుకని అయన ప్రశ్నించారు.
‘పోలీసు మహానుభావులు గ్రామానికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారు. పాపం వారిదేముంది, ఏవరో చేతిలో కీలుబొమ్మలయ్యారు, సొంతంగా ఆలోచించుకునే శక్తి ఇవాళ ఉన్న పోలీసు వ్యవస్థలో లేదు, దానికి తోడు మాట్లాడితే మాది డిసిప్లినరీ సర్వీసెస్ అంటారు. వారికి అన్నీ తెలుసు’ అంటూ జెసి సంచలన వ్యాఖ్యలు చేశారు.