ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ రావడంతో దాదాపు 67 రోజుల తర్వాత శనివారం ఏలూరు జైలు నుంచి బయటకొచ్చారు. జైలు దగ్గరకు భారీగా చేరుకున్న టీడీపీ నేతలు, అభిమానులు చింతమనేని ప్రభాకర్కు ఘన స్వాగతం పలికారు. చింతమనేని జైలు నుంచి ర్యాలీగా బయల్దేరి తన ఇంటికి వెళ్లారు.
చింతమనేని ప్రభాకర్ పై 18 కేసులు నమోదయ్యాయి. దళితులను దూషించిన కేసులో అరెస్టయిన చింతమనేనికి కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. తర్వాత ఆయనపై ఉన్న పాతకేసులు ఒక్కొక్కటిగా విచారణకు రావడంతో మరికొన్ని కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో రిమాండ్తో చింతమనేని విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. శుక్రవారం చింతమనేని బెయిల్ పిటిషన్పై విచారించిన ఏలూరు జిల్లా కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే 14 కేసుల్లో బెయిల్ రాగా.. నిన్న నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది.
ఈ ఏడాది ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసెఫ్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న అభియోగంతో పెదపాడు పోలీస్ స్టేషన్ లో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీంతో చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత తన భార్య ఆరోగ్యం క్షీణించడంతో చింతమనేని అజ్ఞాతం వీడారు. భార్యాపిల్లలను చూసేందుకు దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలోని తన ఇంటికి వస్తుండగా.. పోలీసులు చింతమనేనిని సెప్టెంబర్ 11న అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న చింతమనేని.. 67 రోజుల తరువాత అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.