కేరళ నుంచి ఏకైక మహిళా ఎంపీ రెమ్యా హరిదాస్
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన 52 మంది ఎంపీలలో రెమ్యా హరిదాస్ ఒకరు. ఆమె ఈ స్థానం వరకు రావడం వెనక బోలెడంత పోరాటం ఉంది. కేరళ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక మహిళ, దళిత ఎంపీ ఆమే కావడం విశేషం. కడు పేదరికం నుంచి వచ్చి ఆమె ఇంతవరకు ఎదిగారు. రెమ్య (32) తండ్రి రోజుకూలీ. ఆమె మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ. 22 వేలు మాత్రమే. ఆమె తల్లి టైలరుగా పనిచేస్తూ అవసరాలు తీర్చుకుంటూనే కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా ఉన్నారు.
తన చిన్నతనంలో ఎలా ఎదిగానో రెమ్యా హరిదాస్ గుర్తుచేసుకున్నారు. ‘‘పేదరికాన్ని మేం చాలా దగ్గర నుంచి చూశాం. ఒక పూరి గుడిసెలో నివసించేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో ఉంటున్నాం. ఆడపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు బాగా భయపడే రోజుల్లోనే మా అమ్మ మమ్మల్ని ప్రోత్సహించి, జీవితంలో అన్ని రంగులూ చూసే అవకాశం కల్పించింది’’ అని ఆమె చెప్పారు.
టాలెంట్ హంట్ ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2011లో రెమ్యా హరిదాస్ ను ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో తాను కూడా భాగం కాగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని, మహాత్మాగాంధీ చేసిన తరహాలోనే రాహుల్ గాంధీ కూడా ప్రజలు చెప్పింది విని.. వారి ఫీడ్ బ్యాక్ తీసుకుని తనను ఎంచుకున్నారని ఆమె తెలిపారు. లోక్ సభకు పోటీ చేయడానికి ముందు ఆమె వామపక్ష ప్రభావం తీవ్రంగా ఉండే కున్నమంగళం పంచాయతీ సర్పంచిగా గెలిచారు.
అలతూరు లోక్ సభ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వయింది. అక్కడినుంచి సీపీఎం తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన పీకే బిజుపై రెమ్యా హరిదాస్ పోటీచేశారు. వామపక్షాలకు కంచుకోట లాంటి ఈ స్థానంలో ఆమె ఏకంగా లక్షన్నరకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. తనకు మహిళల నుంచి అపార మద్దతు లభించిందని, పార్లమెంటులో తాను వారి గొంతు వినిపిస్తానని అన్నారు. యువతకు ఉద్యోగాలు, వ్యవసాయ సంక్షోభం గురించి కూడా మాట్లాడుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందని, అది లౌకిక, ప్రజాస్వామిక భారతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు.