అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి.. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. అంతేకాదు దీని వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఫేస్బుక్, ట్విట్టర్లో మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా టీడీపీ సోషల్ మీడియా వింగ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. తనపైన సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు టీడీపీపై విమర్శల దాడికి పదును పెట్టారు.
తనతో నేరుగా ఢీకొట్టలేక ఇలా సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు, పోస్టులు పెడుతున్నారని వంశీ ఆరోపిస్తున్నారు. టీడీపీ అనుబంధ పేజీల నుంచి ఈ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి చిల్ల రాజకీయాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లను దగుల్భాజీలు, సన్నాసులు అంటారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టవారి ఇళ్లలో ఆడవాళ్లు లేరా అంటూ మండిపడ్డారు.
ఇక తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ..’చంద్రబాబు చేసేదేంటి.. నేనే పనిచేయనని చెప్పి బయటకొచ్చేశా’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జూ.ఎన్టీఆర్కి, నారా లోకేశ్కి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని వంశీ పేర్కొన్నారు. లోకేశ్కి పనిలేక సోషల్ మీడియా వింగ్స్ నడుపుకుంటూ కూర్చుంటున్నాడని విమర్శించారు. వెబ్సైట్స్ ద్వారా నేతల మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని.. తనపై కూడా అలా బురదజల్లినందువల్లే మనస్తాపంతో పార్టీని వీడానని తెలిపారు. పరువు కాపాడుకునేందుకు తనను సస్పెండ్ చేశారని వంశీ పేర్కొన్నారు.
అంతకు ముందు.. వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్పై వంశీ చేసిన విమర్శలను టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. వంశీ పార్టీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా టీడీపీలో చర్చ జరిగినట్లు సమాచారం. వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేయనుందని తెలుస్తోంది.
వల్లభనేని వంశీ ఇప్పటికే టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. లేఖను చంద్రబాబుకు కూడా పంపారు. గురువారం ప్రెస్మీట్ పెట్టిన వంశీ చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటూ పార్టీ నేతలపై మండిపడ్డారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని.. కానీ చంద్రబాబు దీక్షల పేరుతో నాటకాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ను వాడుకొని వదిలేశారని.. లోకేశ్ రాజకీయాలకు పనికిరాడంటూ విమర్శించారు. అందుకే టీడీపీని వీడుతున్నానని.. జగన్తో కలిసి ముందుకు సాగుతానన్నారు. వంశీ గత నెల 25న ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తరువత రెండు రోజులకు టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు వాట్సాప సందేశం ద్వారా తెలిపారు. దీనికి చంద్రబాబు సైతం సమాధానం ఇచ్చారు. వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని..పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, వంశీ మాత్రం తన నిర్ణయం వెనక్కు తీసుకుంటున్నట్లుగా ఎక్కడా చెప్పలేదు.