టీడీపీ ఎమ్మెల్యేవల్లభనేని వంశీ పార్టీ మారిన తరువాత కృష్ణాజిల్లా గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. మూడు వర్గాలు..! ముగ్గురు నాయకులు..! ఎవరికి వాళ్లు పెత్తనం కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకళ్లను ఒకళ్లు కొట్టుకుంటున్నారు. కేసులు పెట్టుకుంటున్నారు.
జగన్ చెప్పారు అంతా సర్దుకున్నట్లేనా..!
గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీపై ఒక పక్క సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు. కెడీసీసీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తుండటంతో ఆయా వర్గ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొన్నది. ఇటీవల ఆయా నేతల వర్గీయులు ఘర్షణలు పడటం, కొట్టుకోవడం పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకోవడం వరకూ వెళ్లింది. ఈ పరిణామాలు నియోజకవర్గంలో పార్టీ పై ప్రభావం చూపే ప్రమాదం నెలకొనడం, పార్టీని కూడా ఇరుకున్న పెట్టే పరిస్థితి ఏర్పడటంతో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. మొన్న జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావులు విభేదాలు మరచి కలిసి పని చేయాలని సూచిస్తూ ఇద్దరి చేతులను కలిపారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా వంశీ ఉంటారని జగన్ స్పష్టం చేశారు. నేరుగా వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ కల్పించుకుని ఇద్దరు నేతలను కలిసి పని చేయాలని చేతులు కలిపినంత మాత్రాన వారి మనసులు కలుస్తాయా? జగన్ చెప్పారు కాబట్టి విభేదాలు మరచి కలిసి ప్రయణం చేస్తారా? అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.
మూడు వర్గాలు..!మూడు వివాదాలు..!!
నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పని చేయడానికి ఆయనపై 2014లో పోటీ చేసిన ఓడి పోయిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు గానీ 2019 లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గానీ సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని వారు బహిరంగంగా వ్యక్తం చేశారు. నియోజకవవర్గంలోని పలు గ్రామాల్లో వల్లభనేని వంశీకి, మరి కొన్ని గ్రామాల్లో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్ర రావు కు పట్టు ఉంది. వీరి వర్గీయుల మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరే పరిస్థిితి కనబడటం లేదు. సీఎం జగన్ కలిసి పని చేయాలని చెప్పిన మరుసటి రోజే వారి వారి వర్గ నేతలు ఘర్షణ పడ్డారు, సవాళ్లు చేసుకున్నారు. వంశీ పార్టీ లోకి వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురి అయిన వంశీ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అందరినీ కలుపుకుని పోవాలని తాను ప్రయతిస్తున్నానని అయినా వారు కలిసి రావడం లేదని వంశీ ఇటీవల పేర్కొన్నారు. నియోజకవర్గంలో రాజకీయాలు ఏవిధంగా ఉంటాయనేది వేచి చూడాలి.