న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీద ఆప్ ముప్పేట దాడి మొదలుపెట్టింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండు, తర్వాత అసభ్య పాంప్లెట్లు వేశారంటూ దుమ్మెత్తి పోయడం.. తాజాగా ఢిల్లీ ఎండలు తట్టుకోలేక ‘డూప్’తో ప్రచారం చేయిస్తున్నారని ఆరోపణలు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియానే తాజా ఆరోపణ చేయడం విశేషం. గంభీర్ లాగే కనిపించే ఒక వ్యక్తి కారులో ఉన్న ఫొటోను ఆప్ మద్దతుదారులు ట్విట్టర్ లో వైరల్ చేశారు. అతడు కాంగ్రెస్ నాయకుడని సిసోదియా ఆరోపించారు. సినిమాల్లో డూప్ ఉంటారు, క్రికెట్ లో రన్నర్ ఉంటారు గానీ ప్రచారానికి డూప్లికేటును ఉపయోగించడం ఇదే తొలిసారని సిసోదియా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయనడానికి ఇది నిదర్శనమని ఆరోపించారు. గంభీర్ ఏసీ కారులో కూర్చుని ఉంటే, ఆయన డూప్లికేట్ ఒక టోపీ పెట్టుకుని నిలబడి ప్రచారం చేస్తున్నారన్నారు. తూర్పు ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు నకిలీ గంభీర్ కే దండలు వేస్తున్నారని చెప్పారు.
फिल्मों में स्टंट डबल सुना था
क्रिकेट में रनर सुना था
कैंपेन डुप्लीकेट पहली बार देखा है pic.twitter.com/2c4koRpVdW
— Ankit Lal ? (@AnkitLal) May 10, 2019
తూర్పు ఢిల్లీలో గంభీర్ ను భ్రష్టుపట్టించడానికి ఆప్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తొలుత అతడి నామినేషన్ తిరస్కరించాలంటూ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. వాటిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. తనపై అసభ్య పదజాలంతో గంభీర్ ఒక కరపత్రం వేయించారంటూ ఆఫ్ అభ్యర్థి అతిషి ఏకంగా విలేకరుల సమావేశంలో భోరుమన్నారు. కానీ గంభీర్ ఆ ఆరోపణలను ఖండించడమే కాక.. న్యాయవాది సోనాలి జైట్లీ ద్వారా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, అభ్యర్థి అతిషిలకు పరువునష్టం నోటీసులు పంపారు. మరోవైపు అతిషి ఢిల్లీ మహిళా కమిషన్ వద్ద గంభీర్ పై ఫిర్యాదుచేశారు. తాము కూడా గంభీర్ పై పరువునష్టం దావా వేస్తామని సిసోదియా బెదిరించారు.