(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పావురం.. ఇది శాంతికి చిహ్నం. పావురాన్ని ఇళ్లల్లో పెంచుకోవడంతోపాటు.. బయట ప్రాంతాల్లో ఎక్కువ సేపు వాటితో గడిపేందుకు చాలా మంది ముచ్చటపడతారు. కానీ, ఆ పావురం వల్ల మనిషి ప్రాణానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? పావురాన్ని మనం ప్రేమిస్తుంటే.. దాని ఎఫెక్ట్తో మనిషి ప్రాణానికి ముప్పు వస్తోందట. హైదరాబాద్ జంటనగరాల్లో ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ మనకు పావురాలు కనిపిస్తుంటాయి. కనిపించాయి కదా అని వాటి దగ్గరకు వెళ్లారో అంతే. ప్రాణాంతక వ్యాధులను కొనితెచ్చుకున్నట్టే. నిజం. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయబారి పాత్ర పోషించిన పావురాలు.. ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. జనావాసాల మధ్యన ఉంటూ చారిత్రక కట్టడాలను అందవిహీనంగా మార్చడంతో పాటు, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయట పావురాలు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెరుగుతున్న పావురాల సంఖ్య ప్రజల ఆరోగ్యానికి సమస్యగా మారిందని జీహెచ్ఎంసీ అధికారులు చెపుతున్నారు. వాటి వల్ల మనుషుల్లో శ్వాసకోస వ్యాధులు తలెత్తే అవకాశముందని, వాటికి మేత వేయొద్దని సూచిస్తున్నారు. పావురాల రెట్టలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఫలితంగా మనుషుల అనారోగ్యానికి గురవుతున్నారని చెపుతున్నారు.
పలు బహుళ అంతస్తుల భవనాల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లు, దుకాణాలు ముఖ్యంగా ఆహార పదార్థాలు అమ్మే వారు వీటికి మేత వేయవద్దని చెపుతున్నారు. ఈ మేరకు జీహెచ్ ఎంసీ ఈరోజు మీడియా ప్రకటన చేసింది. నగరంలో ఉన్న హార్టీ కల్చర్ పార్కుల్లో పావురాలకు ఆహారాన్ని వేయటాన్ని జీహెచ్ ఎంసీ ఇప్పటికే నిషేధించింది. మరోవైపు మొజాంజాహి మార్కెట్లో పావురాలకు దాణాగా వేసే జొన్నలు, ఇతర తృణ ధాన్యాలను జీహెచ్ ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పావురాల రెట్టలతో చారిత్రక కట్టడాలు పాడవుతుండడంతో, ఇటీవల మొజాంజాహి మార్కెట్లో 500 పావురాలను పట్టి శ్రీశైలం అడవుల్లో వాటిని విడిచిపెట్టారు. ఈ పావురాల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, చిన్నపిల్లలు, వృద్ధులకు వెంటనే సోకే ప్రమాదం ఉన్నదని వివరించారు. ఈ పావురాలకు ఫీడింగ్ ఇవ్వవద్దని, ముఖ్యంగా మార్కెట్లు, ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల వద్ద పావురాలను ప్రోత్సహించవద్దని కోరారు.