(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కర్నాటకలోని విజయపురలో టీ తాగాలంటే ప్లాస్టిక్ బాటిళ్లు కావాలి. నాలుగు ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే ఒక కప్పు చాయ్ ఇస్తారు. అన్ని చోట్లా కాదనుకోండి. ప్రస్తుతానికి నగరంలోని నాలుగు ఇందిరా క్యాంటిన్లలో ప్లాస్టిక్ బాటిళ్లకు టీ ఇస్తున్నారు.
ఒక సారి వాడి పడేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించే కార్యక్రమం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సాగుతోంది. అందులో భాగంగా విజయపురలో ఈ వినూత్నమైన ఆలోచన అమలు చేస్తున్నట్లు విజయపుర మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ హర్షాషెట్టి పేర్కొన్నారు.
మరి ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించి అందుకు బదులుగా టీ నీరు అందించే ఇందిరా క్యాంటిన్లకు డబ్బెవరిస్తారు? ఈ నెల వరకూ ఇందిరా క్యాంటిన్లకు డబ్బు చెల్లించేందుకు విజయపుర ఆఫీసర్స్ క్లబ్ ముందుకొచ్చింది.
విజయపుర కార్పోరేషన్ ఇంకొక ఆలోచన కూడా చేసింది. సేకరించిన ప్లాస్టిక్ను మరో రకంగా ఉపయోగించేందుకు బాగల్కోట్లోని జెకె సిమెంట్స్ యాజమాన్యంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం విజయపుర కార్పోరేషన్ అందించే ప్లాస్టిక్ను జికె సిమెంట్స్ ఫ్యాక్టరీలో సిమెంట్ తయారీలో వాడతారు. ప్లాస్టిక్ కలిపితే సిమెంట్కు ఇంకాస్త ధృడత్వం వస్తుందట!
(ది హిందూ సౌజన్యంతో)