అమరావతి: ఏపీని పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తమ నివేదికలో సూచించామని జీఎన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వికేంద్రీకరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే జీఎన్రావు నిపుణుల కమిటీ శుక్రవారం సాయంత్రం సీఎం జగన్తో సమావేశమైంది. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు ప్రాంతాలుగా విభజించాలని జీఎన్ రావు తెలిపారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని సూచించామని చెప్పారు. తుళ్లూరులోనే అసెంబ్లీ, రాజ్ భవన్ ఉండాలని.. విశాఖలో హైకోర్టు బెంచ్, సెక్రటేరియట్, సీఎం క్యాంపు ఆఫీస్, వేసవి అసెంబ్లీ ఉండాలని తమ నివేదికలో సూచించినట్టు చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, తుళ్లూరు ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు వెల్లడించారు.
అమరావతిలో రైతులకు అన్ని విధాలుగా భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని తమ నివేదికలో చెప్పినట్టు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతంలో కాకుండా మిగతా ప్రాంతంలో రాజధానిని అభివృద్ధి చేయాలని సూచించామని చెప్పారు. రాజధాని సహా సమగ్ర రాష్ట్రాభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేశారని జీఎన్ రావు తెలిపారు. గత రెండు మూడు నెలల్లో క్షేత్రస్థాయిలో పర్యటించామని తెలిపారు. రాజధానిపై కమిటీ నివేదికను సీఎంకు అందజేశామని జీఎన్రావు తెలిపారు. గతంలో రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టునూ పరిశీలించామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి తప్పనిసరి అని సూచించామని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా చూడాలన్నారు.
‘ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి శ్రీకాకుళం, విజయనగరం ఒక మండలిగా చూడాలి. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాను రెండో మండలిగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడో మండలిగా సీమ నాలుగు జిల్లాలను నాలుగో మండలిగా చూడాలి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో కాకుండా ఎలాంటి ముప్పులేని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని సూచించాం. రాష్ట్రంలోని నదులను పట్టణీకరణ కోసం వాడుకోవాలి. సౌర విద్యుత్ను ఉపయోగించుకోవాలని సూచించాం’ అని జీఎన్రావు తెలిపారు
ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. తీర ప్రాంతంపై అభివృద్ధి ఒత్తిడి ఎక్కువుందని, అభివృద్ధిని మిగతా ప్రాంతాలకూ విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని తెలిపారు. సమగ్ర అభివృద్ధి కోసం అనుసరించాల్సిన విధానాలను… ప్రభుత్వానికి సిఫార్సు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలోను పర్యటించి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేశామని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ… అభివృద్ధి చేసుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా పాటించాలి… అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరపాలో సూచించామని పేర్కొన్నారు.