(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు… సోమవారం లేదా మంగళవారం ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరుగనుంది. ఆ తదుపరి ఏడాది నుంచి 8,9 తరగతులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. దశలవారీగా పదో తరగతి వరకూ ఆంగ్ల మాద్యమంలోనే బోధన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆంగ్లమాధ్యమంలో బోధనపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రూపొందించిన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
సర్కార్ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని అందించాలనే ఉద్దేశంతో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసు కున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో కొన్ని రాజకీయ వర్గాలు, వివిధ సంఘాలు ఇంగ్లీష్ మీడియాన్ని మొదట వ్యతిరేకించినప్పటికీ .. సీఎం జగన్ మాత్రం తాను అను కున్న లక్ష్యానికి దగ్గరగా అడుగులు వేసుకుంటూ వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా మంత్రివర్గంలో కూడా ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నవంబరు 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే విడతల వారీగా 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయనుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2022-23 విద్యాసంవత్సరం నుంచి 10 తరగతి విద్యార్థులకు అమలు చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
టీడీపీ, జనసేన, బీజేపీలతోపాటు తెలుగు భాషా ఉద్యమ సంఘాల నేతలు , వివిధ వర్గాలకు చెందిన నాయకులు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మొదట పూర్తిగా వ్యతిరేకించారు. ఆ తరువాత కొంత మెత్తబడ్డట్టు కనిపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ అంశంపై చర్చ సందర్భంలో కూడా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు స్పష్టంగా అర్థమైంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతామంటే .. అప్పట్లో జగన్యే అడ్డుకున్నారని, తామెప్పుడూ పేద విద్యార్థులకు వ్యతిరేకం కాదని ప్రకటించారు. ఇదే విషయంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తానెప్పుడూ మీరు చెప్పినట్లు వ్యతిరేకించలేదని, మొదటి నుంచి పేదలు ఉన్నత శిఖరానికి ఎదగాలని కోరుకునే వాడినని , నిజంగా మీకు దమ్ము ఉంటే గతంలో నేను వ్యతిరేకించినట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ఒకానొక సందర్భంలో సభ కూడా దద్దరిల్లిపోయింది.
అంతకు ముందు సీఎం జగన్ పలు వేదికల్లో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు ‘మనమళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు .. చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ ఎక్కడ చదువుకున్నాడు .. ప్రస్తుతం ఆయన మనమడు తెలుగు మీడియంలో చదువుతున్నాడా .. పవన్ కల్యాణ్ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవడం లేదా? ’ అంటూ ప్రశ్నించారు. ‘మీ పిల్లలు, మీ మనమళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవచ్చు .. నిరుపేద పిల్లలు మాత్రం చదువుకోకూడదా?’ ఇదెక్కడి న్యాయం ?’ అంటూ నిలదీశారు. ఆ తరువాతే అన్ని వర్గాల్లోనూ కొంత మార్పు రావడం , క్రమేనా రాజకీయ వర్గాలు కూడా జగన్ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. దీంతో సోమవారం సభలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కూడా విపక్షం నుంచి అనుకూల వాతావరణమే లభించే అవకాశాలు అనిపిస్తున్నాయి.