బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జెడిఎస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇటీవల కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా చేయగా తాజాగా మరో 11మంది ఎమ్మెల్యేలు అదే బాటపట్టారు.
ఎమ్మెల్యేలు బిసి పాటిల్, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్, శివరామ, రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్, రమేశ్ జక్కహళ్లి తదితరులు తమ రాజీనామా పత్రాలతో స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. సభాపతి అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ కార్యదర్శికి రాజీనామా పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది, జెడిఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడటంతో కర్నాటకలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి, జెడిఎస్ నేత కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తాజా రాజకీయ పరిస్థితులు తెలుసుకున్న కుమారస్వామి ఈ రాత్రికే అమెరికా నుండి బయలుదేరుతున్నట్లు సమాచారం.
కర్నాటకలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బిజెపి 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా మ్యాజిక్ ఫిగర్కు తొమ్మిది స్థానాలు తగ్గడంతో అధికారానికి దూరంగా ఉండిపోయింది. 80 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ 37 స్థానాలు గెలుచుకున్న జెడిఎస్తో జట్టు కట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆనంద్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్,జెడిఎస్ కూటమి బలం 116కు పడిపోయింది. తాజాగా మరో 11మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్ ఆమోదిస్తే కూటమి బలం 105కు పడిపోతుంది. దీంతో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం నెలకొన్నది.