(రోదిస్తున్న రవూఫ్ అహ్మద్ దార్ కుటుంబ సభ్యులు)
పర్యాటకులను కాపాడిన కశ్మీరీ గైడ్
పహల్గామ్ నదిలో రాఫ్ట్ మునక
శ్రీనగర్: పర్యాటకుల సరదాను కాదనలేక నదిలోకి వెళ్లి.. వాళ్ల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను పణంగా పెట్టాడో కశ్మీరీ గైడ్. లిడ్డర్ నదిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు తనతో ఎందుకు మాట్లాడటం లేదని, తామంతా అతడి కోసం ఎదురు చూస్తున్నామని అంటూ రవూఫ్ అహ్మద్ దార్ (35) తల్లి మిస్రా బేగం గుండెపగిలేలా రోదించారు. అక్కడకు కొద్ది దూరంలోనే కూర్చున్న దార్ భార్య ఏం మాట్లాడాలో కూడా అర్థంకానంత షాక్లో ఉంది.
తన తండ్రి స్థాపించిన క్యాంపింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీని దార్ గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నాడు. కుటుంబం మొత్తానికి అతడి సంపాదనే జీవనాధారం. శుక్రవారం నాడు కొందరు పర్యాటకులు వచ్చారు. అప్పుడే దుకాణం కట్టేయబోతున్న దార్.. వాళ్లు పిలవడంతో ఆగాడు. తాము తర్వాతి రోజే వెళ్లిపోతున్నామని, అందువల్ల తమతో రివర్ రాఫ్టింగ్ చేయించాలని అతడిని కోరారు. ఒకవైపు ఇప్తార్ సమయం అవుతున్నా.. వారి కోసం తిరిగి వెళ్లాడు.
సాయంత్రం 6.30 గంటల సమయంలో రాఫ్ట్ ఉన్నట్టుండి తిరగబడింది. అందులోని ప్రయాణికులందరూ నీళ్లలో పడిపోయారు. రాఫ్ట్ ఎక్కిన ప్రతి ఒక్కరినీ దార్ కాపాడాడు. కానీ అతడి లైఫ్ జాకెట్ మాత్రం నీళ్లలో పడి కొట్టుకుపోయింది. దాంతో అతడు నదిలో మునిగిపోయాడని దార్ బంధువు ఇంతియాజ్ దార్ చెప్పారు. పడవ మునిగిన చోటు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో 12 గంటల తర్వాత అతడి మృతదేహం కనిపించింది.
నిజానికి దార్ ఈ పని మానేసి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనుకున్నాడు. అందుకే ఇగ్నో నుంచి రాజనీతి శాస్త్రంలో పీజీ కూడా చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత గత నాలుగు నెలలుగానే పర్యాటకుల సీజన్ బాగుందని, కానీ ఈసారి కూడా పుల్వామా దాడి తర్వాత వ్యాపారం తగ్గిపోయిందని ఇంతియాజ్ అన్నాడు. దార్ కుటుంబానికి గవర్నర్ రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. దార్ చూపిన ధైర్యాన్ని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ప్రశంసించాయి. రవూఫ్ దార్ త్యాగం ధీరోదాత్తమని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. రవూఫ్ నిజమైన హీరో అని, అతడి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నామని పీడీపీ ప్రతినిధులు అన్నారు.
దార్ ధైర్యవంతుడు కావడంతో పాటు చాలా దయాగుణం ఉన్నవాడని, ఎప్పుడూ అవతలివాళ్ల అవసరాలు చూస్తాడు తప్ప తనగురించి ఆలోచించడని అతడి మేనమామ చెప్పారు. అందుకే పర్యాటకులకు కుదరదని చెప్పలేకపోయాడన్నారు. ఏవో మెడల్స్, పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, అతడి తమ్ముడికి మంచి ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తన అన్న చేసిన పని తాను మాత్రం చేయలేనని బషారత్ చెప్పాడు.