పొలంలో చాపర్ అనుమతించని రైతు
యువకుల శవాలతో హార్దిక్ రాజకీయం
అందుకే కాలు పెట్టనివ్వలేదు: వినయ్ పటేల్
రోడ్డు మార్గంలో వచ్చిన కాంగ్రెస్ నేత
అహ్మదాబాద్: కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ కు సొంత రాష్ట్రం గుజరాత్ లో చేదు అనుభవం ఎదురైంది. మహిసాగర్ జిల్లా లునావాడాకు హెలికాప్టర్ లో వెళ్లి వద్దామనుకున్న ఆయన.. వెనుదిరగాల్సి వచ్చింది. తన పొలంలో హెలికాప్టర్ దిగడానికి వీల్లేదని సదరు పొలం యజమాని అయిన రైతు అభ్యంతరం చెప్పడంతో ఆయన హెలికాప్టర్ అక్కడ దిగలేకపోయింది. దాంతో అక్కడకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్ వరకు చాపర్ లో వెళ్లి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో మళ్లీ లూనావాడా రావాల్సి వచ్చింది.
2015లో పాటీదార్ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం నడిపి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్.. ప్రతిపక్షం తరఫున గుజరాత్ లో స్టార్ ప్రచారకుడయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు ఆయనకు ఒక హెలికాప్టర్ కూడా కేటాయించారు. పంచమహల్ లోక్ సభ అభ్యర్థి వీచట్ భాయ్ కాంత్ కు అనుకూలంగా ప్రచారం చేయడానికి లూనావాడా వెళ్లాలని తలపెట్టగా, అక్కడ హార్దిక్ పటేల్ కు చుక్కెదురైంది. తన పొలంలో చాపర్ దిగడానికి వీల్లేదని వినయ్ పటేల్ అనే రైతు అభ్యంతరం వ్యక్తంచేశారు. రిజర్వేషన్ల ఉద్యమంలో మరణించినవారి శవాలతో హార్దిక్ రాజకీయం చేస్తున్నాడని వినయ్ పటేల్ మండిపడ్డారు. సాయంత్రం 5 గంటల సమయంలో హార్దిక్ పటేల్ అక్కడ ప్రచారానికి రావాల్సి ఉంది. కానీ వినయ్ అనుమతి నిరాకరించడంతో చాపర్ అక్కడ దిగలేకపోయిందని రెసిడెంట్ అదనపు కలెక్టర్ ఆర్ఆర్ ఠక్కర్ తెలిపారు. తనకు తెలియకుండా కాంగ్రెస్ నాయకుడొకరు తన పొలానికి అనుమతి తీసుకున్నారని వినయ్ పటేల్ అన్నారు. హార్దిక్ పటేల్ కూడా తమ కులానికి చెందినవాడేనని, అతడెవరో తనకు తెలుసని చెప్పారు. ఉద్యమంలో మరణించిన 14 మంది యువకుల శవాలతో రాజకీయం చేస్తున్నందుకే అతడిని తన పొలంలో కాలు పెట్టనివ్వలేదని తెలిపారు.