(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికల హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఈ నెల 27న కోర్టు తీర్పు వెలువడనుంది. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని శుక్రవారం నల్గొండ జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానకి ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఈకేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్ధానాన్ని కోరారు. నిందితుడి తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ నెల 27న తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది.
గత కొద్ది రోజులుగా కొనసాగిన విచారణలో సాక్షులను, సాంకేతిక నిపుణులు చెప్పిన విషయాలను కోర్టు పరిశీలించింది. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన వంద మందికి పైగా సాక్షులను విచారించింది. అయితే ఈ కేసులతో తనకు సంబంధం లేదని, అన్యాయంగా పోలీసులే ఇరికించారంటూ జడ్జి ముందు శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఈ కేసు వాదనలు పూర్తియ్యాయి. దీంతో తుది తీర్పును ఈ నెల 27న వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
యాదాద్రి- భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హాజీపూర్లో శ్రావణి అనే మైనర్ బాలిక హత్య కలకలం రేపింది. ఆ కేసులో విచారణ చేస్తోన్న పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్.. శ్రావణితో పాటు గతంలో అదృశ్యమైన అదే గ్రామానికి చెందిన కల్పన, మనీషా అనే ఇద్దరు మైనర్ బాలికలను కూడా చంపేసినట్టు గుర్తించారు. పొలానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన అనంతరం చంపేసి అక్కడే ఉన్న వ్యవసాయ భావిలో శవాలను పడేసినట్టు విచారణలో తేలింది. అంతేకాదు మరో మహిళ హత్య కేసులోనూ నిందితుడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై హాజీపూర్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్తో అందరూ పోలీసులు కీర్తిస్తుంటే.. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో ఇంతవరకూ ఏమీ చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దిశ నిందితుల మాదిరిగానే హాజీపూర్ ఘటనలోనూ పరిష్కారం చూపాలని, తక్షణమే శ్రీనివారెడ్డిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు తెలంగాణ గవర్నర్ తమిళిసైని గత డిసెంబర్ 16న కలిశాయి. తమ న్యాయం చేయాలని, కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఫిర్యాదు చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డే కిల్లర్ అని పోలీసులు ఆధారాలను సమర్పించడంతో.. న్యాయస్థానం త్వరలోనే శిక్షను ఖరారు చేయనుంది.