(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్ ఘటనపై బాధిత కుటుంబాలు తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశాయి. సోమవారం రాజ్ భవన్ లో ఆమెతో భేటీ అయ్యారు. హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కోరుతూ ఆమెకు ఓ వినతిపత్రం సమర్పించారు. ముగ్గురు బాలికలను శ్రీనివాస్ రెడ్డి పాశవికంగా హతమార్చిన విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చారు. బాధిత కుటుంబాల వినతిపై గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో బాధిత కుటుంబాలు మాట్లాడుతూ, నిందితుడు శ్రీనివాస్ రెడ్డిన ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. దిశ ఘటనలో నిందితులను ఎలా అయితే హతమార్చారో.. శ్రీనివాస్ రెడ్డిని కూడా అదేవిధంగా చంపాలన్నారు.
కాగా, కొన్ని నెలల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ కు చెందిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై హాజీపూర్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఓ వైపు దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్తో అందరూ పోలీసులు కీర్తిస్తుంటే.. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో ఇంతవరకూ ఏమీ చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిశ నిందితుల మాదిరిగానే హాజీపూర్ ఘటనలోనూ పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే శ్రీనివారెడ్డిని శిక్షించాలని కోరుతున్నారు.