(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపిలో విగ్రహాల విధ్వంస పర్వం కొనసాగుతున్నట్లే కనబడుతోంది. అంతర్వేది, విజయవాడ ఘటనలు మరువక ముందే మరో రెండు ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ వరుస ఘటనలు ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్గా మారుతున్నాయి.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో దుండగులు హనుమాన్ విగ్రహం చేయిని విరగొట్టారు. ఏలేశ్వరం శివాలయం వద్ద నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై స్థానికులు, హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేశారు. అదే విధంగా బుధవారం రాత్రి కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కాశీవిశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నంది విగ్రహం చెవులను దుండగులు పగులగొట్టారు. దీనిపై స్థానికులు వత్సవాయి పోలీసులకు సమాచారం అందించారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీనర్శింహ స్వామి రథం తగులబెట్టిన సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి, జనసేన, హింధూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయిన నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వరుసగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెండి సింహాలు మాయం కావడం, నిడమానూరులో సాయి బాబా విగ్రహ ధ్వంసం ఘటనలు జరిగాయి. ఈ ఘటనలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, హింధూ సంఘాల ఆందోళనలు జరుగుతుండగానే మరో రెండు ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి.
అధికార పార్టీ నేతలు ఆరోపించినట్లుగా ఈ వరుస ఘటనలు జరుగుతుండటం మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతున్నదా అన్న అనుమానాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?