న్యూఢిల్లీ: హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారాన్ని చేపట్టే మెజార్టీ రాలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపాయి. అయితే అనూహ్య రీతిలో హర్యానాలో కమలం పార్టీ కుదేల్ అయ్యింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజారిటీని సాధించలేకపోయింది. గత పర్యాయం మినిమం మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఇప్పుడు మాత్రం హర్యానా ప్రజలకు ఝలక్ ఇచ్చారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 46 సీట్లను గెల్చుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ, అధికార బీజేపీ 40 సీట్ల వద్దే ఆగిపోయింది. కాంగ్రెస్ 31 స్థానాలను గెలుచుకోగా, జేజేపీ 10, ఇతరులు 9 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జేజేపీతో పాటు, తమతో కలసివచ్చే ఇండిపెండెంట్లను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలాకు సీఎం పదవిని కాంగ్రెస్ ఆఫర్ చేసింది. కర్ణాటక తరహా ఫార్ములాను అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఆయన…. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పార్టీ సీనియర్ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాల్లో 40 సీట్లు సాధించిన అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా ఆరు సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో స్వతంత్రుల మద్దతు కోరేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. పది సీట్లు సాధించిన జన్ నాయక్ జనతా పార్టీ, ఎనిమిది మంది స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ఇదిఇలా ఉంటే.. హర్యానా మరో కర్ణాటకగా మారినట్టుందని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో తొలుత జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సరిగ్గా 14 నెలల తరువాత సర్కార్ స్థానంలో బీజేపీ అధికారాన్ని అందుకోగలిగింది. అది వేరే విషయం. అయితే, కర్ణాటకలో అనుసరించిన ఫార్ములా తరహాలోనే హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీకి.. అధికారాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్ కు సీఎం పదవిని అప్పగించిన విషయం తెలిసిందే. అదే తరహా వ్యూహాన్ని హర్యానాలోనూ ఆ పార్టీ అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నట్టుగానే.. హర్యానాలోనూ జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ)కి సీఎం స్థానాన్ని అప్పగించడానికి సన్నద్ధంగా ఉన్నట్లు సంకేతాలను పంపించింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జేజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. డిప్యూటీ సీఎంతోపాటు మంత్రివర్గంలోని కీలక పదవులను సమానంగా పంచుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహంలా కనిపిస్తోంది. అయితే, ఇది ఎంతవరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా అందరి దృష్టి హర్యానాపైనే ఉన్నాయి.