అల్వార్: పాత సినిమాల్లో ఖైదీలను జైలు నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్తుండగా మధ్యలో కొందరు దుండగులు వచ్చి అడ్డగించి, పోలీసులపై కాల్పులు జరుపుతుండగా ఖైదీలు తప్పించుకుని పారిపోతారు. తాజాగా ఇంచుమించు ఇలాంటి ఘటనే రాజస్థాన్ లోని అల్వార్ లో చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం అరుగురు దుండగులు పోలీస్ స్టేషన్ పై కాల్పులకు తెగబడ్డారు. దాదాపు 25 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. పోలీసులు వారిని ఎదుర్కొనే పనిలో ఉండగా..జైలులో ఉన్న ఖైదీతో పరారయ్యారు. ఈ సందర్భంగా హర్యానాకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ విక్రమ్ గుజ్జర్ తప్పించుకున్నాడు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే ఖైదీని తప్పించారని పోలీసులు తెలిపారు. అయితే, కాల్పలు సందర్భంగా ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదని చెప్పారు. తప్పించుకున్న విక్రమ్ గుజ్జర్ పై లక్ష రూపాయల రివార్డు ఉందని వివరించారు. విక్రమ్ గుజ్జర్ పై హర్యానాలో ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. దుండగులు ఏకే 47 రైఫిళ్లు వాడినట్లు తెలిపారు.
ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. గతంలో హర్యానాలోని కోర్టు నుంచి ఇదే తరహాలో విక్రమ్ తప్పించుకున్నాడని చెప్పారు. తాజాగా ఘటనపై హర్యానా డీజీపీతో మాట్లాడుతున్నామని, నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.