అతడు అఫ్ఘానీ పౌరుడు.. పేరు ఎహసానుల్లా. వయసు 26.. హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని జైలులో కలిసేందుకు ఒక లాయర్ వచ్చింది. ఆమె వయసు సుమారు 30 ఏళ్లు. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామంటూ పంజాబ్ హర్యానా హైకోర్టును వారు కోరారు. కోర్టు అందుకు ఒప్పుకొంది. మళ్లీ కోర్టుకు వెళ్లి, తమ పెళ్లిని రిజిస్టర్ కూడా చేసుకుంటామన్నారు. పోలీసు భద్రత నడుమ పెళ్లి రిజిస్టర్ చేయాలని కోర్టు ఆదేశించింది. 2016 సంవత్సరంలో ఎహసానుల్లా చండీగఢ్ లోని ఒక పీజీ కాలేజిలో చదువుతున్నాడు. ఆ సంవత్సరం మార్చి నెలలో తమ దేశానికే చెందిన సనావుల్లా అనే వ్యక్తి హత్యకేసులో అతడు అరెస్టయ్యాడు. మసీదులో మొదలైన గొడవ నేపథ్యంలో సనావుల్లాను ఎహసానుల్లా కత్తితో పొట్టలో పొడిచాడు.
2017 సెప్టెంబరు నెలలో కోర్టు అతడిని దోషిగా నిర్ణయించి జీవితఖైదు శిక్ష విధించింది. ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేయగా, ‘హత్యకిందకు రాని నిందార్హమైన ప్రాణనష్టం’గా ఆ కేసును తేల్చి, జైలుశిక్షను ఐదేళ్లకు తగ్గించింది. శిక్ష పూర్తయిన తర్వాత అతడిని తమ సొంతదేశానికి పంపేయాలని కూడా కోర్టు చెప్పింది. ఈ కేసు సమయంలోనే సిక్కు మహిళా లాయరుతో అతడు ప్రేమలో పడ్డాడు. దాంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని 2018 అక్టోబరులో కోర్టును కోరాడు. పెళ్లికి బెయిల్ కూడా ఇవ్వాలని అడిగాడు. అందుకు కోర్టు అంగీకరించింది. వారి పెళ్లికి తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది. 2018 అక్టోబరు 15న వారి పెళ్లయింది. తర్వాత మళ్లీ అతడు జైల్లోకి వెళ్లిపోయాడు. ఇప్పటికి అతడు మూడేళ్ల 8 నెలల జైలుశిక్ష అనుభవించాడు. కోర్టు అతడిని స్వదేశానికి పంపేయాలని ఆదేశించినా, అతడి భార్య మాత్రం ఎలాగోలా ఇక్కడే ఉంచేలా చూడాలని ప్రయత్నిస్తోంది.