క్రైస్ట్ చర్చ్ (న్యూజిలాండ్): వారంతా ఎంతో భక్తితో శుక్రవారం మసీదులో ప్రార్థనలు చేసుకుందామని వచ్చారు. అంతలో ఒక దుండగుడు ఉన్నట్టుండి కాల్పులు జరిపాడు. దాంతో కడపటి వార్తలు అందేసరికి ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఎక్కువమంది వచ్చినపుడు దుండగుడు కాల్పులు జరిపాడు. దాంతో ఎక్కువ మందికి తూటా గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని ఓ ప్రకటనలో చెప్పారు. పోలీసులు కూడా పూర్తి సామర్ధ్యంతో అక్కడ ఉన్నారు. ముప్పు మాత్రం చాలా తీవ్రస్థాయిలో ఉందని అన్నారు.
మస్జిద్ అల్ నూర్ అనే ఈ మసీదులో భక్తులు చాలా పెద్దసంఖ్యలో ఉన్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా వారిలో ఉండటం విశేషం. తాను డీన్స్ ఏవ్ మసీదులో ప్రార్థనలకు వెళ్లానని, అంతలో కాల్పుల శబ్దం వినిపించిందని, తీరాచూస్తే తన భార్య బయట మరణించి పడి ఉందని ఓ వ్యక్తి చెప్పారు. పిల్లలను కూడా దుండగుడు వదల్లేదని మరో వ్యక్తి అన్నారు. తనచుట్టూ మృతదేహాల కుప్పలు పడి ఉన్నాయన్నారు. ఎక్కడ చూసినా రక్త ప్రవాహమేనని, కనీసం నలుగురు మరణించి కనిపించారని ఓ ప్రత్యక్ష సాక్షి రేడియో న్యూజిలాండ్ కు చెప్పారు. దుండగుడు మిలటరీ తరహా దుస్తులలో వచ్చాడని మరొకరు తెలిపారు.
తీవ్రస్థాయిలో కాల్పులు కొనసాగుతున్నందువల్ల నగరంలోని స్కూళ్లను మూయించారు. ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ మైక్ బుష చెప్పారు. జనం వీధుల్లోకి రావద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చెప్పాలని ఆయన కోరారు. పౌర కార్యాలయాలు, లైబ్రరీ సహా అన్ని ప్రభుత్వ భవనాలు మూసేశారు. వాతావరణ మార్పుపై పిల్లల ర్యాలీ ఉండటంతో అందులో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రుల కోసం సిటీకౌన్సిల్ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటుచేసింది. పిల్లలను తీసుకెళ్లడానికి రావద్దని, పోలీసులు చెప్పేవరకు బయటకు వెళ్లద్దని కోరారు.