(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది జలాశయాలకు వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,85,926 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా మొత్తం పది గేట్లను ఎత్తి 3,72,392 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 884.91 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.08 టిఎంసిలుగా నమోదయింది. సాగర్ ఎగువనున్న ప్రాజెక్టులన్నీ గరిష్ట స్థాయికి చేరడంతో ఆయా జలాశయాల నుండి కూడా వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ గరిష్ఠ స్థాయికి చేరడంతో ఎన్ఎస్పి అధికారులు ఈ నెల 17 నుండి డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయానికి శ్రీశైలం నుండి 2,35,642 క్యూసెక్కుల వరద నీరు రాగా డ్యాం 14 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,46,017 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అదే విధంగా పులిచింతలకు ఇన్ఫ్లో 2,58,593 క్యూసెక్కులు కాగా దిగువకు 2,53,129 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర శనివారం ఉదయానికి 2,56,788 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 2,18,464 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతుండటంతో దిగువన నదీ పరివాహాక ప్రాంతంలో ప్రజానీకాన్ని అధికారులు అప్రమత్తం చేశారు.