(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి కోస్తావైపు పయనిస్తోంది. తాళ్లరేవు- కాకినాడ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఏపీలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపు నీరు చేరుతోంది. ఇటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి వానలు పడుతున్నాయి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత తొలిసారి ఒకే సంవత్సరం ఏడోసారి డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు నీరు వదిలారు. జులై తర్వాత వరుసగా వస్తున్న వరద నీటితో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయికి నిండింది. కర్నాటక, మహారాష్ట్రల్లోని కృష్ణా రివర్ బేసిన్లో కురిసిన భారీ వర్షాలు నదిలోకి భారీగా వరదనీరు చేరింది. ఫలితంగా ఆల్మట్టి, నారాయణ్పూర్, జూరాల, తుంగభద్ర ఢ్యామ్ల నుంచి తరచూ లక్షలాది క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు పలు మార్లు చేరింది. దాంతో ఒకే సీజన్లో అది కూడా జులై-అక్టోబర్ నెలల మధ్య కాలంలో ఏడు సార్లు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీరు వదిలారు. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మంగళవారం రాత్రి మూడు గేట్లు సుమారు పది అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే వరద ఉధృతి మరింత పెరగడంతో బుధవారం ఉదయం ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.