హైదరాబాద్: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణారెడ్డి మిత్ర ద్రోహి అంటూ మండిపడ్డారు. ఆయన అక్రమాలకు సంబంధించి కొన్ని నిజాలు ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాలను మీడియా ద్వారా బయటపెడదామని తాను అనుకున్నానని… అయితే వాటిని ప్రసారం చేసే దమ్ము దేశంలోని ఏ మీడియాకు లేదని తెలిపారు.
https://youtu.be/QcUsuXil-hU
‘ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకొని, ముఖ్యమంత్రులతో పంచుకోవడం చాలా పెద్ద దేశ ద్రోహం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రులు, కాంట్రాక్టర్లు దోచుకోవడం దేశ ద్రోహం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలతో బస్సులు కొని.. బస్సులతో వచ్చే ఆదాయాన్ని సొంత జేబుల్లోకి నింపుకోవడం నిఖార్సయిన దేశ ద్రోహం. ఓఎన్జీసీలోని 27 రిగ్గుల కాంట్రాక్టును దక్కించుకుని ప్రజాధనాన్ని లూఠీ చేయాలనుకుంటున్న దేశ ద్రోశం గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. ఆ దేశ ద్రోహి, దేశానికి ముప్పుగా పరిణమించిన వ్యక్తి.. మేఘా కృష్ణారెడ్డి. అతడు నడిపే సంస్థ పేరు.. మేఘా ఇంజనీరింగ్. నా దృష్టిలో అదో చైనా పీస్. గత 7 ఏళ్లలో ఆ వ్యక్తి కంపెనీ ఆదాయం రూ.26వేల కోట్లకు వెళ్లిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన సంస్థ ఈయనది కాదు.. గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తికి చెందినది. ఈ రెండు సంస్థల బాగోతాలను బయటపెడతాను. బంగారు తెలంగాణలో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టులో మెఘా కృష్ణారెడ్డి చేతివాటం రూ.35 వేల కోట్లు. సాక్ష్యాధారాలతో సహా మీ ముందు ఉంచుతా. ఒక మిత్ర ద్రోహి గురించి నిజాలు తెలియాలన్న ఉద్దేశంతో అతడు చేస్తున్న ఘోరాలు, దేశానికి చేస్తున్న నష్టాన్ని ఆధారాలతో మీ ముందు ఉంచుతా. నాకు ప్రాణహాని ఉంది. నాలుగు నెలల క్రితమే ప్రధానికి, హోం మంత్రికి రాష్ట్రపతికి మెయిల్ పెట్టాన’నని శివాజీ తెలిపారు. గతంలో ఆపరేషన్ గరుడ అంటూ హీరో శివాజీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.