(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతిలో మహిళల పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై అమరావతి రైతులు, మహిళలు, న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ ముగిసింది.
విజయవాడ ర్యాలీలో పాల్గొన్న 610 మందిని ఎందుకు అరెస్టు చేశారు? నిరసనలో పాల్గొన్న వారి ఐడి కార్డులు ఎందుకు అడిగారు? అని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. నిరసన కారులు ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘించారని ఎజి న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. మహిళను బూటుకాలితో మగ పోలీసు తన్నడంపై కోర్టు వివరణ అడిగింది. మహిళ నోరు ఎందుకు బలవంతంగా నొక్కారని పోలీసులను ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయొద్దన్న సుప్రీం కోర్టు తీర్పును ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేయగా, 2014 నుండి రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయనీ, వాటిని కొనసాగిస్తున్నామనీ, కొత్తగా అమలు చేయటం లేదనీ ఏజి వివరించారు.
రాజధాని వీధుల్లో పోలీసుల కవాతు చేయాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అమరావతిలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని ఏజి చెప్పగా, పోలీసు బలగాలను ఎందుకు మోహరించారని హైకోర్టు ప్రశ్నించింది. ముందు జాగ్రత్త చర్యగా అల్లర్లు జరగకుండా పోలీసులు మోహరించారని ఏజి సమాధానమిచ్చారు. సమగ్రంగా ప్రమాణపత్రం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును ఏజి కోరారు. అనంతరం దీనిపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.