హైదరాబాద్: చటాన్పల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్ను శుక్రవారం హైకోర్టులో విచారించింది. ఈ సందర్భంగా.. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు మృతదేహాలను భద్ర పరచాలని కోర్టు తెలిపింది. రెండు రోజుల్లో విచారణ కమిషన్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. విచారణ కమిషన్ నిందితుల మృతదేహాలను పరిశీలించే అవకాశం ఉందని, రీపోస్ట్మార్టం అడగొచ్చని అభిప్రాపయడింది. అప్పటి వరకు మృతదేహాలను భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.
దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ అనంతరం మృతదేహాలకు మహబూబ్నగర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం హైకోర్టు ఆదేశాలతో మృతదేహాలను హైదరాబాద్లోని గాంథీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టు చెప్పే వరకు నిందితుల తల్లిదండ్రులకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మృతదేహాల అప్పగింత ఆలస్యమౌతుండడంతో నిందితుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. నలుగురు నిందితులు చనిపోయి ఇప్పటికే ఎనిమిది రోజులు గడిచింది.
మరోవైపు దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. ఆరునెలల్లో విచారణను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్కు దారి తీసిన పరిస్థితులతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపైనా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పూకర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను నియమించింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్ సోండుర్ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ ఈ కమిషన్లో సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. తాము ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సహకరించాల్సి ఉందన్నారు. సిట్ తన దర్యాప్తు వివరాలను విచారణ కమిటీతో పంచుకోవాలని సూచించింది. ఈ కేసులో మీడియా, సోషల్ మీడియాను కట్టడి చేయాలని ఆదేశించింది.
డిసెంబర్ 6న తెల్లవారుజామున చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నిందితులు మృతి చెందారు. ఎన్కౌంటర్పై సందేహాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ హైకోర్టులో దాఖలవడంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మృతదేహాలను ఆస్పత్రిలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కేసును సుమోటోగా స్వీకరించింది. ఎన్హెచ్ఆర్సీ 9, 10, 11 తేదీల్లో ఘటనపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లింది. మృతదేహాలను ఈనెల 12 వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశంచడంతో అదే రోజు రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుప్రీం కోర్టులో సైతం ఈ ఎన్కౌంటర్పై విచారణ కోరుతూ పిటిషన్ దాఖలవడం, విచారణకు త్రిసభ్య రిటైర్డ్ జడ్జిల కమిషన్ను సుప్రీం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కింది కోర్టుల్లో ఉన్న అన్ని కేసులపై స్టే విధించారు.