హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్ ముందు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ హాజరయ్యారు. నిందితుల మృతదేహాల పరిస్థితి ఎలా ఉందని హైకోర్టు శ్రావణ్ను ప్రశ్నించింది. అనంతరం ఈ నెల 23 సాయంత్రం 5 గంటల్లోపు రీపోస్టుమార్టం పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అయితే తెలంగాణ డాక్టర్లపై తమకు నమ్మకం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు తెలిపారు. దీంతో కోర్టు ఇండిపెండెండ్ ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించింది. రీ పోస్టుమార్టం అనంతరమే నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని, కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్ను సీల్డ్ కవర్లో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం వీడియో తీయాలని తెలిపింది.
అంతకు ముందు.. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ హైకోర్టుకు దిశ నిందితుల మృతదేహాల పరిస్థితిని హైకోర్టుకు వివరించారు. నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయని శ్రావణ్ హైకోర్టుకు తెలిపారు. -2 నుంచి -4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాలుగు మృతదేహాలను ప్రీజర్లో ఉంచామని తెలిపారు. ఇంకా మృతదేహాలు ప్రీజర్లలో ఉంటే మరో వారం లేదా పది రోజుల్లో మృత దేహాలు పూర్తిగా కుళ్లిపోతాయని శ్రావణ్ వివరించారు. దేశంలో ఇతర ఆస్పత్రుల్లో మృతదేహాలను భద్రపరిచేందుకు అవకాశం ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా.. మిగతా ఆస్పత్రుల్లో వసతులపై తనకు అవగాహన లేదని శ్రావణ్ చెప్పారు. డిసెంబర్ 9న మృతదేహాలను గాంధీకి తీసుకొచ్చారని తెలిపారు.
నవంబర్ 27వ తేదీ రాత్రి శంషాబాద్ సమీపంలోని చటాన్పల్లి వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి.. హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను డిసెంబర్ 6వ తేదీన పోలీసులు ఘటనా స్థలికి తీసుకెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. షాద్ నగర్ మండలం చటాన్పల్లి బ్రిడ్జి సమీపంలో దిశను తగులబెట్టిన చోటే నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. తాము చెప్పే వరకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో పోలీసులు మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రి నుంచి వాటిని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగి 15 రోజులపైనే అవుతోంది. ఈ నేపథ్యంలో మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. ఇప్పటికే ఆ మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు ఎంతో ఖరీదైన ఇంజెక్షన్స్ ఇచ్చి.. ఎంబామింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోతోంది. పోస్టుమార్టం అనంతరమే నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది.