అమరావతి: ఏపీలో పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలపై హైపవర్ కమిటీ చర్చించిందని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ రెండో భేటీ శుక్రవారం ముగిసింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. రాజధాని ప్రాంత రైతులు, జిల్లాలు, ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై కమిటీ చర్చించింది. సమావేశం అనంతరం మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. కమిటీ చర్చించిన వివరాలను మంత్రి పేర్నినాని వివరించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలతోపాటు శివరామకృష్ణన్ కమీటీ ఇచ్చిన నివేదికలను కూడా తాజా భేటీలో పరిశీలించారని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి జరగాలని తాను పేర్కొ న్నట్లు తెలిపారు. ఈ నెల 13న మరోసారి సమావేశమై ఒక అభిప్రాయానికి వస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోందని, తప్పకుండా రైతుల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
అమరావతి రైతుల అంశంపై టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మరో మంత్రి కన్నబాబు ఆరోపించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెర తీశారని ధ్వజమెత్తారు. రైతుల్లో లేనిపోని అపోహలతో గందరగోళం సృష్టించాలని, అమరావతిలో భూ దందాను నడిపి ఆయన లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదా? వెనుకబడిన ప్రాంతాలు అలానే ఉండాలా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి కోసం గురువారం మచిలీపట్నంలో అఖిలపక్ష నేతలు విరాళాలు సేకరించడంపై విమర్శలు చేశారు.
గతంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసమని విరాళాలు సేకరించారని, ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు అంటూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని విమర్శించారు. జోలె పట్టుకొని తిరగడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? అని ప్రశ్నించారు. గతంలో అమరావతి కోసం సేకరించిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తమది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదన్నారు. రాజధానిపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, స్వలాభం కోసమే చంద్రబాబు తాపత్రాయపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజాధనం కొల్లగొట్టారని మండిపడ్డారు. విరాళాల పేరుతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం జగన్ పై విమర్శలు చేయడం సబబు కాదని ప్రతిపక్షాలకు మంత్రి మోపిదేవి హితవు పలికారు.