అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం విజయవాడలో రెండోసారి సమావేశం కాబోతోంది. అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేయనుంది. ఈ భేటీలో విశాఖకు తరలివచ్చే ఉద్యోగులకు కల్పించాల్సిన కీలక సౌకర్యాలపై చర్చించనున్నారు. ఉద్యోగులు విశాఖకు వస్తే.. నామమాత్రపు ధరకే 200 గజాల స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ.25 లక్షల రుణం అందించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేకాదు, అమరావతి నుంచి ఇంటి సామాన్లు తరలింపు విషయంలో ఉద్యోగి హోదాను బట్టి రూ.1లక్ష నుంచి రూ.50వేలు చెల్లించాలని, ఉచిత వసతి సౌకర్యం కల్పించే దిశగా ప్రతిపాదన సిద్ధం చేశారు. కుటుంబం సహా తరలివస్తే నాలుగు వేల రాయితీ కూడా చెల్లించేందుకు నిర్ణయించారు. అమరావతిలో ఇచ్చినట్లుగా విశాఖలోను బస్, రైలు ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలని, వారానికి ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనలు రెడీ చేశారు. వాటితో పాటు మరిన్ని సౌకర్యాలను ఉద్యోగుల ముందు ఉంచనున్నారు.
విజయవాడలో జరిగిన హైపవర్ కమిటీ తొలి సమావేశంలో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ జరగాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండు రిపోర్టులపై మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన హైపవర్ కమిటీ చర్చించింది. ఇప్పుడు రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల దృష్ట్యా ఇవాళ్టి భేటీలో దీనిపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో రైతులకు ఎలా న్యాయం చెయ్యాలి? గత ప్రభుత్వం ఏయే హామీలతో భూములు సేకరించింది? ఆ హామీలను ఎలా నిలబెట్టాలి ? రైతులకు ఎలాంటి హామీలు ఇవ్వాలి అనే అంశాలపై చర్చించనుంది. రాజధానిని అమరావతి నుంచీ తరలిస్తే… అమరావతి భూములను ఎలా ఉపయోగించాలి? అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఈనెల 20 కల్లా తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని తెలిసింది. ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశమై రాజధాని అంశంపై చర్చించనుంది. ఆ తర్వాత… అఖిలపక్ష భేటీ నిర్వహించి… తన నిర్ణయాన్ని చెప్పనుందని తెలుస్తోంది.